పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షానికి చెంప పెట్టని ఏపీ రాష్ట్ర  నీటి పారుదల శాఖ మంత్రి పి. అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు.గోదావరి వరద తగ్గగానే పోలవరం పనులు చేపడతామని మంత్రి అనిల్‌ స్పష్టీకరించారు. విపక్షాలు ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా చేస్తున్నామన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరంలో హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ రద్దు చేసి, రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో దిగువ కోర్టు విధించిన స్టే ను హైకోర్టు ఇవాళ ఎత్తివేసిందన్నారు. దీంతో ప్రాజెక్టు పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్‌ యాదవ్‌ గురువారం ఒక ప్రకటన చేశారు.
 పోలవరంలో పవర్‌ పవర్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించిన నవయుగ సంస్థ స్టే ఆర్డర్‌ తెచ్చుకుంది. దీనిపై గురువారం విచారణ ముగించిన హైకోర్టు గతంలో దిగువ కోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తివేయడంతో పాటు, కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకునేందుకు అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది.
 ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌ పిటిషన్‌కు విలువ ఉండదన్న అడ్వకేట్‌ జనర్‌ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. అదే విధంగా బ్యాంకు గ్యారంటీలను ఎన్‌క్యాష్‌ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇన్‌జంక్షన్‌ ఆర్డర్‌ను కూడా హైకోర్టు పక్కన పెట్టింది. దిగువ కోర్టు తీర్పును కూడా హైకోర్టు తప్పు బట్టింది. నవయుగ సంస్థ సదుద్దేశంతో కోర్టును ఆశ్రయించలేదన్న అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. 
 హైకోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, గోదావరిలో వరద తగ్గిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని ప్రకటించారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: