రాజకీయ ప్రత్యర్ధులు మంచి పని చేసిన విమర్శించడం అన్నది నేటి రాజకీయాల్లో ఆనవాయితీ . దానికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే కారణాలు వెతకడం సహజంగా మారింది . ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపధ్యం లో అది మరింత సర్వసాధారమైంది . ఎందుకంటే ఎప్పుడు... ఎవరు ఏ పార్టీ లో చేరుతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది .ఈ నేపధ్యం లో తెలుగుదేశం పార్టీ కి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని అభినందించడం హాట్ టాఫిక్ గా మారింది . రెండవసారి ఎంపీగా గెల్చిన తరువాత నాని , పార్టీ అధినేత చంద్రబాబుకు పట్టపగలే చుక్కలు చూపిస్తూ వస్తున్నారు .
తాజాగా ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడం పట్ల నాని హర్షం వ్యక్తం చేశారు . ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారన్న అయన , ప్రభుత్వ నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు . మంత్రి పేర్ని నాని ని కూడా కేశినేని అభినందించారు . లాభాలు వచ్చే మార్గం లోనే ప్రయివేట్ ఆపరేటర్లు బస్సులు నడుపుతారని , నష్టాల్లో వచ్చే మార్గాల్లో బస్సులు నడిపేందుకు ఇష్ట పడరని, దాంతో ప్రజలు ఇబ్బందులుపడే అవకాశాలున్నాయని చెప్పారు . కేశినేని నాని కూడా గతం లో ప్రయివేట్ బస్సులను నిర్వహించిన విషయం తెల్సిందే.
ఒకవైపు తెలంగాణ లో ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని కార్మికులు సమ్మె చేస్తుండగా , మరొకవైపు జగన్ సర్కార్ చేసి చూపించడం , ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీ కి చెందిన ఎంపీ అభినందించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది .