ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడితే తాను నిప్పు.. అంటూ చెప్పుకుంటారు. కానీ ఆయన హయాంలో కేవలం ఓ సామాజిక వర్గం వారు మాత్రమే లాభపడ్డారని బాగా ప్రచారం జరిగింది. మొన్నటి ఎన్నికల్లో జనం కూడా అదే తీర్పు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు హాయంలో జరిగిన దారుణాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు జగన్ సర్కారు ఆ లెక్కలు సరిచేస్తోందంటున్నారు వైసీపీ నేతలు.
నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి జగన్ సర్కారు బిగ్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో నారా చంద్రబాబు తన సమీప బంధువు, బాలకృష్ణ వియ్యంకుడికి దాదాపు 500 ఎకరాల భూమి కట్టబెట్టారట. అది కూడా కేవలం ఎకరాకు లక్ష రూపాయల ధరపై ఇచ్చేశారట.
ఎకరా కేవలం నామమాత్రపు ధర రూ. లక్షకు 498.93 ఎకరాలను కేటాయించారని మంత్రి పేర్ని నాని తెలిపారు. అంతటితో ఆగకుండా ఆ భూమిని సీఆర్డీఏ పరిధిలోకి తీసుకువస్తూ చంద్రబాబు జీఓ జారీ చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాల్లో అత్యంత అనైతికంగా భావిస్తూ.. ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేస్తూ.. గత ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు చేసిన భూకేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. అదే విధంగా విశాఖపట్నం బీచ్ రోడ్డులో మార్కెట్లో ఎకరా రూ. 50 కోట్లు ధర పలికే అత్యంత విలువైన 13 ఎకరాల 83 సెంట్ల భూమిని హీనాతి హీనంగా ఎకరా రూ. 4 లక్షలకు లూలూ అనే సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారన్నారు. ప్రజల ఆస్తిని కొల్లగొట్టే రీతిలో ఉన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీర్మానించడం జరిగిందని మంత్రి పేర్ని నాని వివరించారు.