అక్రమాస్తుల
కేసుల విచారణ నుండి మినహాయింపు కోరుతూ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటీషన్ను
కోర్టు కొట్టేసింది. సిఎంగా ఉన్నందున తన కేసుల విచారణ నుండి తనకు వ్యక్తిగత
మినహాయింపు కోరుతు నాంపల్లిలోని సిబిఐ కోర్టులో జగన్ ఓ పిటీషన్ వేశారు. జగన్ పిటీషన్
ను సిబిఐ సహజంగానే తీవ్రంగా వ్యతిరేకించింది.
సరే ఇదే కేసులో విచారణ జరిపిన కోర్టు జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం కుదరని తేల్చిచెప్పేసింది. అంటే కోర్టు తీర్పు ఒకరకంగా జగన్ కు షాక్ అనే చెప్పాలి. ఈ విషయంలోనే చంద్రబాబునాయుడుతో సహా టిడిపి నేతలందరూ పండగ చేసుకుంటున్నారు.
కోర్టు తీర్పు రావటమే ఆలస్యం వెంటనే జగన్ రాజీనామాను డిమాండ్ చేసేస్తున్నారు. నైతిక బాధ్యత వహించి జగన్ వెంటనే రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి కెఎస్ జవహర్ డిమాండ్ చేశారు. అక్రమార్జన కేసులో జగన్ కు జైలుశిక్ష ఖాయమంటూ మరో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రెచ్చిపోయారు. ఇక మిగిలిన టిడిపి నేతలు కూడా తక్కువేమీ తినలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ కు కోర్టు మినహాయింపు ఇవ్వకూడదని టిడిపి నేతలు కోరుకున్నారు. ఎక్కడ మినహాయింపు ఇచ్చేస్తుందో అని టెన్షన్ పడినట్లే ఉంది చూస్తుంటే. ఇటువంటి కేసులే చంద్రబాబునాయుడు మీద కూడా ఉన్న విషయాన్ని టిడిపి నేతలు మరచిపోతున్నారు. చంద్రబాబంత తెలివి జగన్ కు లేదు కాబట్టి కోర్టులతో పోరాడుతున్నాడంతే.
ఇక సిబిఐ అడ్డుగోలు వ్యతిరేకత గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే. జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇస్తే సాక్ష్యులను ప్రలోభపెడతాడని, భయపెడతాడని వాదించింది. ఒక్కరోజు మినహాయింపు ఇస్తేనే జగన్ ఈపని చేయగలిగినపుడు మరి మిగిలిన ఆరు రోజులు బయటే ఉంటారు కదా ? అప్పుడు సాక్ష్యులను బెదిరించరా ?
సాక్ష్యులను బెదిరించాలంటే జగనే నేరుగా మాట్లాడాలా ? తన నమ్మకస్తుల్లో ఎవరికి పురమాయించినా ఆ పనిచేస్తారు కదా ? ఇంతచిన్న లాజిక్ సిబిఐ ఎలా మిస్సయిందో ? సిబిఐ వాదనను కోర్టు ఎలా సమర్ధించిందో ? అర్ధం కావటం లేదు.