పోలవరం నిర్మాణ విషయంలో హైకోర్టు కొత్త కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకొనేందుకు అనుమతిని ఇవ్వడంతో ప్రాజెక్టు పనులు పునః ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు మెగా సంస్థ ఆధ్వర్యంలో మెగా ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్
మురళి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. భూమిపూజ కార్యక్రమానికి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. కాగా పోలవరం ప్రాజెక్టు వద్ద భూమిపూజ నిర్వహించేందుకు వచ్చిన మెగా సంస్థ ఇంజినీర్లు, అధికారులను సబ్కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు.
మరోవైపు బకాయి డబ్బులు చెల్లించాలంటూ సబ్కాంట్రాక్టర్లు, కార్మికులు ఆందోళన చేపట్టారు. గతంలో తాము చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నిధులు ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యంత్రాల తరలింపును అడ్డుకున్నారు.
పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. దీంతో సబ్కాంట్రాక్టర్లు, కార్మికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ రక్షణలో యంత్ర సామాగ్రి ప్రాజెక్టు వద్దకు చేరుకున్నాయి. మెగా ఇంజినీర్లు, అధికారులు, యంత్రాలను ప్రాజెక్టు వద్దకు పంపించారు. దీంతో అక్కడ భూమి పూజ నిర్వహించారు మెగా సంస్థ ప్రతినిధులు. శనివారం నుంచి పనులను ముమ్మరం చేస్తామన్నారు.
అటు సబ్కాంట్రాక్టర్ల ఆందోళనపై
ఏపీ ఇరిగేషన్ శాఖ
మంత్రి అనిల్కుమార్ స్పందించారు. రావాల్సిన బకాయిలతో మెగా సంస్థకు సంబంధం లేదని.. గతంలో పనులు చేసిన నవయుగ కంపెనీని అడగాలన్నారు. గతంలో పోలవరం హైడల్(జల విద్యుత్) ప్రాజెక్టు నిర్మాణం కోసం నవయుగ కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు కి సంబంధించి అక్టోబర్ 31వ తేదీ గురువారం విచారణ జరగగా ప్రాజెక్టు నిర్మాణానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..విచారణ ముగించింది.