ఏపి రాజకీయాలు రోజుకో కొత్తమలుపు తీసుకుంటున్నాయి. జగన్ను టార్గెట్ చేసిన్న చంద్రబాబు ఏపి ప్రభుత్వం మీద రోజుకో బురద చల్లుతుంటే. మరోవైపు తన స్వంత పార్టీలోని నేతలు ఈ చంద్రుని పార్టీని నడి రోడ్డులోకి లాగుతున్నారు. ఇప్పటికే పార్టీ నుండి కీలక నేతలు వేరే పార్టీలోకి వెళ్లిపోగా మిగిలిన వారైన క్రమశిక్షణతో ఉంటూ పార్టీ ప్రతిష్టను కాపాడుకుంటారనుకుంటే అది లేకుండా నలుగురిలో నవ్వులపాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఏపీలో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత ఆ పార్టీ నేతల మధ్య ఏ మాత్రం పొసగని పరిస్థితి ఉంది. పార్టీ వద్దనుకున్న వారు వెళ్లిపోతుంటే, ఇక ఉన్న వారు సైతం వారిలో వారికి విభేదాలు వస్తుండడంతో ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఇక తాజాగా జిల్లా టీడీపీ సమీక్ష సమావేశం సాక్షిగా తూర్పు నియోజకవర్గంలో దేవినేని వర్సెస్ గద్దె వర్గాలు బాబు సమక్షంలోనే గొడవకు దిగాయి. ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గద్దె విదేశాల్లో ఉండడంతో ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇకపోతే గద్దె రామ్మోహన్ రావు వర్గం వారు తమను చిన్నచూపు చూస్తోందని దేవినేని వర్గం వారు టీడీపీ అధినేతకు ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా పదవుల్లో సైతం తమకు అన్యాయం జరుగుతోందని వారు నేరుగా చంద్రబాబుకే వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా తూర్పులో మాత్రం గద్దె రామ్మోహన్ రావు జగన్ గాలిని ఎదుర్కొని మరీ విజయం సాధించారు.
ఇకపోతే గతంలో రద్దయిన కంకిపాడు నియోజకవర్గం నుంచి నెహ్రూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలను పునర్విభజిస్తూ పెనమలూరు నియోజకవర్గం వచ్చింది. కంకిపాడులో అధికభాగాన్ని విజయవాడ తూర్పులో కలిపారు. దీంతో తూర్పులో నెహ్రూకు మంచి పట్టు దొరికింది. అందుకే 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా 25 వేల ఓట్లు వచ్చాయి. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ తమ కుటుంబానికి పట్టున్న తూర్పు సీటు అవినాష్ ఆశించారు.
ఈ నేపథ్యంలో బాబు చివర్లో ఆయన్ను గుడివాడకు పంపగా అక్కడ భారీగా ఖర్చు చేసినా ఓడిపోయారు. నెహ్రూ కాంగ్రెస్ నుంచి టీడీపీకిలోకి రావడంతో ఆయన వర్గం కూడా టీడీపీలోకి వచ్చింది. అయితే అప్పటికే తూర్పులో గద్దె రామ్మోహన్ వర్గం పట్టు సాధించింది. ఇప్పుడు గద్దె నియోజకర్గంపై గ్రిప్ తెచ్చుకుని తన వర్గంతో హవా చెలాయిస్తున్నారు. ఇలా పదవులతో పాటు రాజకీయ ఆధిపత్యం విషయంలో దేవినేని వర్గం రేసులో వెనకపడిపోయింది.
దీంతో ఇప్పుడు వారంతా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు టీడీపీలో దేవినేని, గద్దె వర్గాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేవినేని వర్గం ఏకంగా సమీక్షా సమావేశంలో చంద్రబాబు దగ్గరే తాడోపేడోకి రెడీ అయ్యిందట. ఇప్పటికే జగన్ ఇస్తున్న షాక్లకు చందబాబు కిందమీద పడుతుంటే ఈ కొత్త తలనొప్పులేంటని అమోమయంలో ఉన్నారట.