తెలుగుదేశం పార్టీ తన చరిత్రలో అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఏనాడూ ఇన్ని తక్కువ సీట్లు తెచ్చుకోలేదు. మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు ఉంటే.. టీడీపీ గెలుచుకున్నది కేవలం 23 సీట్లు మాత్రమే. అంతే కాదు.. ఏకంగా జిల్లాలకు జిల్లాల్లోటీడీపీ తుడుచిపెట్టుకుపోయింది. ప్రత్యేకించి రాయలసీమలో ఆ పార్టీ కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కించుకుంది.


ఇక ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి సీనియర్లు కూడా బీజేపీలో చేరిపోయారు. ఇక ఎమ్మెల్యేలు మాత్రం మిగిలారు. వారిలో వల్లభనేని వంశీ వంటి వారు వైసీపీలో చేరికకు రంగంసిద్ధం చేసుకున్నారు. వైసీపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని జగన్ రూల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయినా సరే.. ఆ రూల్ కట్టుబడి మరీ వలసలకు రెడీ అవుతున్నారు నేతలు.


ఇలాంటి సమయంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మరో బాంబు పేల్చారు. రాష్ట్రంలో టీడీపీ జీరో అయిందని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి సరే అంటే టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు. చంద్రబాబులాగా వైయస్‌ జగన్ ఎవరినీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. దృష్టి లోపం నివారణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం రెండో విడతను చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు కేసులకు భయపడి టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపారని ఆయన విమర్శించారు. టీడీపీని కూడా బీజేపీలో కలిపేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ధైర్యం చాలడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా బీజేపీలో చేరాలని తపిస్తున్నారని చెప్పారు. ఈ మాటల్లో ఎంత నిజం ఉందో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: