ఇ.ఎస్.ఐ స్కాంలో తవ్విన కొద్ది నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ దేవికారాణి చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మందుల కొనుగోలు పేరుతో ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చుచేసి జల్సాలతో ఎంజాయ్ చేసింది. ఇందుకోసం ఏకంగా షెల్ కంపెనీలనే సృష్టించింది దేవికారాణి. పాపం పండి ఏసీబీ అధికారులు.. దేవికారాణిని అరెస్ట్ చేసి.. జరిగిన స్కాం అంతా బయటకు లాగుతున్నారు. 



ఇ.ఎస్.ఐ మందుల స్కామ్‌లో అరెస్టయిన డైరెక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రజల సొమ్ముతో ఎంజాయ్‌  చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. కోట్ల విలువైన నగలను కొనుగోలు చేసింది. డొల్ల కంపెనీలను నెలకొల్పి.. నేరుగా జువెలరీ షాపులకే డబ్బులను మళ్లించింది. అలాగే దండుకున్న డబ్బులతో ఆమె జల్సాలు చేసిన వీడియోలు వెలుగు చూశాయి. దేవికారాణి షెల్‌ కంపెనీలను అధికారులు గుర్తించారు. ఈ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ అరెస్ట్‌ చేసింది. 



కంచే చేను మేసినట్లు.. ప్రభుత్వ డబ్బులకు కాపలాగా ఉండాల్సిన దేవికారాణి.. అవినీతిని ప్రోత్సహించడంలో ఏ మాత్రం వెనుకాడ లేదు. 2016-18 మధ్యకాలంలో మహిధర్‌ మెడికల్‌ అండ్‌ సర్జికల్‌ నుంచి 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసింది. అయితే వీటి వాస్తవ విలువ 62 లక్షలే.  మిగతా 3 కోట్లకు పైగా సొమ్ము దేవికారాణి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. వీటన్నింటి ఆధారాలను ఏసీబీ సంపాదించింది. జై సాయిరామ్‌ సంస్థ నుంచి మరో 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. వీటి వాస్తవ విలువ కూడా 12 లక్షలుగా బయటపడింది.  తేజా ఫార్మా నుంచి రూ.5 కోట్ల 50 లక్షల విలువైన మందులు కొనగా.. వీటి విలువ ఒక కోటీ 41 లక్షలుగా గుర్తించింది ఏసీబీ.  తేజా ఫార్మా ప్రతినిధులతో కలిసి మొత్తం 8  డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసింది దేవికారాణి. ఈ షెల్ కంపెనీల నుంచి వచ్చిన  సొమ్ములను కూడా పి.ఎమ్.జె జువెలరీ షాపునకు మళ్లించినట్లు తెలిసింది.  ఇక్కడే రూ.5 కోట్ల విలువైన నగలను దేవికారాణి కొన్నట్లు అధికారులు ఆధారాలు సంపాదించారు. మిగతా సొమ్మును దేవికారాణి, నాగలక్ష్మి పంచుకున్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. 


 
ఇదే కాదు.. దేవికారాణి చాలా జల్సా జీవితం గడిపినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు. పెద్ద మొత్తంలో ఆస్తులు ఆమె సంపాదించింది. దోచుకున్న సొమ్ముతో పూర్తిగా ఎంజాయ్‌ చేసింది. ఇప్పుడు బయటకొచ్చిన ఆ వీడియోలే కలకలం రేపుతున్నాయ్‌. లక్షలు వెచ్చించి బర్త్‌ డే పార్టీలు నిర్వహించింది. భారీ విల్లా కొనుగోలు చేసింది. పి.ఎమ్.జె లాంటి అతిపెద్ద జువెలరీ షాపులో కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసింది. చేతికి ఎముకే లేదన్నట్లుగా అవినీతి సొమ్మును ఖర్చుచేసింది. మొత్తం 8 షెల్‌ కంపెనీల ద్వారా 25 కోట్లకు పైగా మందులు కొనుగోలు చేసి  డబ్బులు డ్రా చేసిందామె. ఈ మందుల వాస్తవ విలువ రూ.4 కోట్లు అయితే.. మిగతా సొమ్మును దేవికారాణి, నాగలక్ష్మి అకౌంట్లలో పడినట్లు గుర్తించారు అధికారులు. ఇ.ఎస్.ఐ  స్కామ్‌లో తాజాగా తేజా ఫార్మా ఎండీ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేసింది ఏసీబీ. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్‌ అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: