మోటార్ వెహికిల్ చట్టం ఆధారంగానే ఆర్టీసీని 20 శాతం ప్రయివేటీకరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే , అసలు మోటార్ వెహికిల్ చట్టాన్ని తెలంగాణ లో అమలు చేయమని చెప్పిన కేసీఆర్ , ఇప్పుడు స్వరాన్ని మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు . తెలంగాణ లో కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికిల్ చట్టాన్ని అమలు చేసేది లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ , ఇప్పుడు మాట మార్చి మోటార్ వెహికిల్ చట్టం ఆధారంగా ఆర్టీసీ రూట్లను ప్రయివేటీకరిస్తామని కార్మికులను భయపెడుతున్నారని విరుచుకుపడ్డారు .
ప్రయివేటీకరణ ద్వారా సంస్థకు లాభం జరగాలని , అంతేకాని వ్యక్తులకు లాభం జరుగుతుందని అనుకుంటే అంగీకరించేదిలేదని లక్ష్మణ్ ఖరాఖండిగా తేల్చి చెప్పారు . కేంద్రం కూడా ఎయిర్ ఇండియా ను ప్రయివేటీకరిస్తోందని , దానివల్ల సంస్థ కు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు . కేంద్రం ప్రవేశపెట్టిన మోటార్ వెహికిల్ చట్టం ఆధారంగానే పలు రూట్లను ప్రయివేటీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చిన కేసీఆర్, ఈ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ బీజేపీ ఎంపీ లు ఎక్కడున్నారని ప్రశ్నించారు . దమ్ముంటే పార్లమెంట్ లో సవరణ చేయాలని డిమాండ్ చేశారు . బీజేపీ నేతలు శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు .
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు యూనియన్లు , ప్రతిపక్షాలే కారణమని కేసీఆర్ ఆరోపించారు . కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రైల్వేలను , ఎయిర్ ఇండియా ను ప్రయివేటీకరిస్తోందని , ఆర్టీసీ లో 20 శాతం బస్సులను ప్రయివేటీకరిస్తే మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు . ఆర్టీసీ లో పోటీతత్వం కోసమే 20 శాతం బస్సులను ప్రయివేట్ వ్యక్తుల నుంచి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు .