ఆర్టీసీ స‌మ్మెలో ఊహించ‌ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ``మూడు రోజుల్లోగా విధుల్లో చేరండి..లేదంటే..మిమ్మల్ని ఎవ‌రూ కాపాడ‌లేరు`` అంటూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఊహించ‌ని ట్విస్టు జ‌రిగింది. ఆదివారం ప‌లు డిపోల‌లో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది... సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ సమ్మతి పత్రాలను డిపో మేనేజర్లకు అందజేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇలా స‌మ్మె విర‌మించిన‌ట్లు ప్ర‌క‌టించిన ఓ డ్రైవ‌ర్ షాకిచ్చాడు. సత్తుపల్లి డిపోకి చెందిన ముభీన్ అనే డ్రైవ‌ర్ ఊహించ‌ని ట్విస్టిచ్చాడు.


సమ్మె వ‌దిలి డ్యూటీలో చేరిన ముభీన్‌...24 గంటలు కూడా గడవకముందే నిర్ణయం మార్చుకున్నాడు. సీఎం కేసీఆర్‌ మాటలకు భయపడి తాను విధులల్లో చేరానని..కానీ జేఏసీ, కార్మికులు, చనిపోయిన కుటుంబాలు తమ కోసమే సమ్మె చేస్తున్నారని గుర్తించినట్లు తెలిపాడు. ఆర్టీసీ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారు గుర్తుకు వచ్చారని అందుకే తాను చేసిన పని మంచిది కాదని నిర్ణయం తీసుకుని మళ్లీ సమ్మె బాట పట్టానని వెల్ల‌డించాడు. చేస్తున్న పని సరికాదని తెలుసుకొని సమ్మెలో ఉండటానికి నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాడోపేడో తేలేంతవరక జేఏసీతోనే ఉంటానని చెప్పుకొచ్చిన ముభీన్..కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నారని ఆర్టీసి డ్రైవర్ ముభీన్ మండిప‌డ్డాడు. సీఎం కేసీఆర్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నానని హామీ ఇచ్చేంతవరకు దయచేసి ఏ ఒక్క కార్మికుడు విధుల్లోకి చేరవద్దని సూచించాడు.


కాగా,  సమ్మె ప్రారంభించి 30 రోజులు కావస్తున్నా.. ఎలాంటి ఫలితం లేకపోవటం, సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధపడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇదే స‌మ‌యంలో ఆర్టీసీ యూనియన్ నేతలు సైతం త‌మ ప‌ట్టును కొన‌సాగిస్తున్నారు. కార్మికులు ఒక్కొక్కరే చేరడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. కార్మికులు ఉద్యోగాల్లో చేరవ‌ద్ద‌ని కోరుతున్నారు. దీంతో సంఘాల అభిప్రాయానికి విలువ ఇస్తూ...ప‌లువురు త‌మ ఆలోచ‌న‌లు మానుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: