ఏపీలో పాలనపై పట్టు పెంచుకునేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు సంచలనంగా మారుతున్నాయి. తన పాలనకు ఆరు మాసాల్లోనే మంచి మార్కులు వేయించుకునే దిశగా అడుగులు వేస్తున్న జగన్.. ఈ క్రమంలో నిష్కర్షగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తన మన అనే తేడా లేకుండా ప్రజల కోసం పనిచేయాలనే సంకేతాలను పంపుతున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్నిజగన్ బదిలీ చేసేశారు. అదికూడా ఎలాంటి ప్రాధాన్యం లేని మానవ వనరుల ఆభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్గా ఆయనను ట్రాన్స్ఫర్ చేయడం మరింత సంచలనం సృష్టించింది.
అయితే, ఎల్వీ విషయం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఇసుక విషయంలో ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. నిజానికి రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యే సమయానికి సీఎం జగన్ అమెరికాలో ఉన్నారు. దాదాపు 12 రోజుల పాటు ఆయన పాలననుపూర్తిగా ఎల్వీ చేతిలోనే పెట్టారు. అయితే, ముందు చూపు లేక పోవడంతో ఇసుక విషయంలో ప్రభుత్వం అభాసు పాలైంది.
అదే సమయంలో అధికారులను సమన్వయం చేయడంలోనూ ఎల్వీ విఫలమయ్యారు. ఈ కారణంగానే ఆత్మకూరు వంటి ఘటనలు తెరమీదికి వచ్చినప్పుడు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇలాంటివి పునరావృతం అవుతూ ఉంటూ.. విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావించిన జగన్ ఎల్వీపై వేటు వేశారు.తద్వారా పాలనపై పట్టు బిగించారు. మిగిలిన ఉన్నతాధికారుల విషయంలోనూ ఆయన ఇవే సంకేతాలను పంపారు.
ముందు చూపు, ప్రజాసంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగని అధికారులపై బదిలీ వేటు ఎప్పుడైనా పడుతుందనే సంకేతాలు పంపారు. అదేవిధంగా అధికారులు, శాఖలు అన్నీ కూడా సమన్వయంతో పనిచేయాల్సిం దేనని చెప్పకనే చెప్పేశారు. ఈ విషయంలో మంత్రులకు కూడా పరోక్షంగా సంకేతాలు పంపినట్టయింది. దీనిని బట్టి.. రాబోయే రోజుల్లో జగన్ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.