నూతన రాజకీయ చిత్రపటంలో ఆంధ్రప్రదెశ్
రాజధాని మాయమైంది. ఇదొక అపశకునం అనుకుంటే, మరో షాకింగ్ ప్రధాన కార్యదర్శి బదిలీ వార్త విని జనం ఒక్కసారి దిగ్భ్రమకు గురయ్యారు. ఇక ఇంకో దురదృష్ట సంఘటన ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అనేక కంపెనీలు, పరిశ్రమలు ఇప్పుడు తిరోగమనం దిశగా పయనిస్తున్నాయి. వాస్తవానికి పెట్టుబడులు పెట్టకుండానే వారి వారి ఒప్పందాలను ఒక్కో కంపెనీ వరుసగా వెనక్కి తీసుకుంటుంది. ఏపీలో ఏం జరుగు తోంది? అనే విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.
అయితే అందరి నోళ్ళూ ప్రజాస్వామ్యంలో మూయలేం గదా! దీంతో ఏపీలో ఏం జరుగుతోందనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. విషయం పరిశీలిస్తే గడిచిన ఐదేళ్ల కాలంలో మాజీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో
విశాఖ వేదికగా ఏటా జనవరిలో “పెట్టుబడుల సదస్సు” నిర్వహించే వారు. ఈ క్రమం లోనే కొన్ని ప్రసిద్ధ కంపెనీలు వచ్చి ప్రభుత్వంతో “ఎంవోయూ”లు కుదుర్చుకున్నాయి అని బాగా ప్రచారం జరిగింది. చంద్రబాబు ప్రచార ప్రియుడు కదా! "అసలు చీమంతైతే బాబు చెప్పేది చిరుతంత" అయితే రాబోయే రెండు దశాబ్ధాల కాలంలో ఏపీలో భారీ ఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.
నాటి నారా చంద్రబాబు ప్రభుత్వం ఆసక్తితో ముందుకు వచ్చిన కంపెనీలకు కొన్ని జిల్లాల్లో భూములు కూడా కేటాయించింది. కొన్నింటికి ఉచితంగానే భూములు కేటాయించగా, మరికొన్ని సంస్థలకు ఎకరం ఒక రూపాయి ధరకే కేటాయించిన పరిస్థితి ఉంది. ఇందులో తస్మదీయులు అస్మదీయుల లెక్క కూడా చాలా అయోమయం గా ఉండేది. అయితే, ఇప్పుడు ఆ కంపెనీలు నాటి ఒప్పందాలను వరసగా రద్దు చేసుకుంటున్నాయి.
*ఇప్పటికే సింగపూర్ కు చెందిన కంపెనీ రాజధాని నిర్మాణ కాంట్రాక్ట్ నుండి తప్పుకొంది.
*ఆదానీ గ్రూప్ కంపెనీలు దాదాపు 20 ఏళ్లలో ₹ 72000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ కుదుర్చుకుని ఇప్పుడు దాన్ని కేవలం ₹ 20000 కోట్లకే కుదించి వేసిందని సమాచారం.
*సంచలం ఏమంటే ప్రఖ్యాత
రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా రాష్ట్రం లో పెట్టుబడుల నుంచి తప్పుకొనేందుకు సిద్ధమౌతున్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ముందుగా రెండు ఒప్పందాల్లో ఒకటిని రద్దు చేసుకుంది.
తిరుపతి సమీపంలో ₹15000 కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి
పరిశ్రమ ఆలోచనను
రిలయన్స్ విరమించుకున్నట్టు తాజాగా రాష్ట్ర
పరిశ్రమ ల శాఖ అధికారులు తెలిపారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం
రిలయన్స్ కు కేటాయించిన తిరుపతిలోని 150 ఎకరాలను తిరిగి తీసుకునేందుకు
వైసీపీ సర్కారు సిద్ధమైంది.
రెండవదైన
కాకినాడ కేంద్రంగా “చమురు సహజ వాయువు ఉత్పత్తి పరిశోధన & అభివృద్ధి” మాత్రం కొనసాగించేందుకు
రిలయన్స్ సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ ఏపిని ఆకర్షిస్తోంది. ఇలా ఎందుకు జరుగు తోంది? ప్రభుత్వ పాలనా నిర్వహణ లోపమా? లేక ప్రభుత్వమే పరిశ్రమలపై ఆసక్తి చూపించడం లేదా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే విషయంపై విశ్లేషకులలోనే కాదు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
గత చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు ఉదారంగా అనుమతులు ఇచ్చింది. అయితే, తాజా జగన్ నాయకత్వంలోని వైసీపి ప్రభుత్వం మాత్రం స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాల్సిందేనని షరతు విధించడం పలు విధాలుగా అంతటా ఉవ్వెత్తున లేచి పెను సంచలనంగా మారింది. స్థానికులకు 75% ఉద్యోగాలను రిజర్వ్ చేస్తే నైపుణ్యం అవసరమైన చోట ఆ అంశం అడ్డురావటం ఖాయం. ఇది పారిశ్రామిక రంగానికి మాత్రం ప్రయోజనకరం కాదు
మిగిలిన వాటి పరిస్థితి ఎలా ఉన్నా, పరిశ్రమలు రివర్స్ లో వెళ్ళిపోతున్న విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరంగానే పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో రాజధాని విషయంపై ఎలాంటి స్పష్టత లేక పోవడం కూడా తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. వీటికి తోడు దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ప్రభావం కూడా పెట్టుబడులు పెట్టే వారికి ఆటంకంగా మారింది. దీంతో మొగ్గదశలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితికి సంధికొట్టే విధంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.