గత ప్రభుత్వం ఇసుక పాలసీ విధానంలో లోపాలు ఉన్నాయని, ఇసుకను ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని అక్రమాలు చేసిందని చెప్పి వైకాపా ప్రభుత్వం చెప్తోంది. ఇసుక పాలసీలో మార్పులు తీసుకురావాలని, ఇసుకలో అవకతవకలు తీసుకురాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, దానికి కొంత సమయం పడుతుందని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఇసుకను బయటకు తీసుకురాలేదు. కాలయాపన జారుతుండటంతో ఇసుక దొరక్క ఎక్కడి నిర్మాణ పనులు అక్కడే ఆగిపోయాయి. నిర్మాణ పనులపై ఆధారపడిన వ్యక్తులు ఉపాధి లేక.. కుటుంబాలను పోషించుకునే మార్గం దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇప్పటికే 26 మంది అడ్డా కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి. ఎవరు దీనికి సమాధానం చెప్పాలి. ఎవరు దీనిపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం తప్పులు చేసిందని ఇప్పటి ప్రభుత్వం చెప్తోంది. కావాలనే ఇసుక కొరతను సృష్టిస్తోందని గతంలో అధికారంలో ఉన్న
తెలుగుదేశం పార్టీ చెప్తోంది. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆ బురదలో పాపం అమాయకమైన ప్రజలు కొట్టుకుపోతున్నారు.
తాజాగా కాకినాడలో వీరబాబు అనే తాపీ పనిచేసుకునే వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంతకాలం క్రితం వీరబాబు
కాకినాడ వచ్చాడు. అక్కడే తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఇసుక కొరత ఉందని చెప్పి కొంతకాలంగా పనులు ఆగిపోయాయి. పనులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రజలే కాదు, అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఈ రెండు మూడు నెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారులంగా దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారాలు రోడ్డున పడుతున్నారు. ముఖ్యంగా
అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వేలకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పెట్టుబడులు వృధా అయ్యేలా కనిపిస్తున్నాయి.
రాజధాని విషయంలో క్లారిటీ లేకపోవడంతో
రాజధాని ప్రాంతంలోని ప్రజలు సైతం అయోమయంలో పడిపోయారు.