వచ్చే మే నెల నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ కావాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. జనవరిలో దీనికి  సంబంధించి భర్తీ కోసం క్యాలెండర్‌ ఇవ్వాలన్నారు. మంగళవారం స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్ల నాని, అధికారులు హాజరైన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. నాడు – నేడు కింద అన్ని ప్రభుత్వాసుపత్రులనూ బాగు చేయాలని చెప్పారు. సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులను కూడా బాగు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రతి ఆస్పత్రిలో కూడా మందుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 510  రకాలకు పైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. డిసెంబర్‌ 15 నుంచి కూడా ఈ మందులు అందుబాటులో పెట్టాలంటూ.. ఆ దిశగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.



నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు బాగా పెరగాలన్నారు. దాదాపు 45వేల స్కూళ్లను నాడు – నేడు కింద బాగు చేయాలని సీఎం తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలు, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేయనున్నట్టు తెలిపారు. దీని కోసం భారీగా నిధులను వెచ్చిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్‌ పెయింటింగ్, ఫినిషింగ్‌.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నాడు– నేడు కింద స్కూళ్లలో మొత్తం 9 రకాల పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్‌ లిస్టు అందుబాటులో ఉండాలన్నారు. స్కూళ్లలో, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి సరైన ప్రణాళిక ఉండాలన్నారు. దీనికి సంబంధించి ఆర్థిక వనరులు లోటు లేకుండా చూసుకోవాలని సూచించారు. 



నవంబర్‌ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నట్టు తెలిపారు. స్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాదు, నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నట్టు సీఎం వెల్లడించారు. దీనికి సంబంధించి పాఠ్యప్రణాళిక రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూలు ప్రారంభం కాగానే విద్యార్థులకు యూనిఫారమ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలన్నారు. స్కూలు తెరిచిన తర్వాత సెప్టెంబరు,  అక్టోబరు వరకూ పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.  వచ్చే ఏడాది 9 తరగతిలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: