మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. త్వరలో సర్కారు ఏర్పాటవుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జోక్యం చేసుకోవాలని శివసేన నేత లేఖ రాయడం కలకలం రేపుతోంది. ప్రస్తుత పరిణామాల తరుణంలో.. తాము వేచిచూసే వైఖరి అవలంబిస్తున్నట్టు ఎన్.సి.పి ప్రకటించింది.


మహారాష్ట్రలో వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు శివసేన ముఖ్య నేతలు సంజయ్‌ రౌత్‌, రాందాస్‌ కదం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలవగా.. అటు ఎన్.సి.పి అధినేత శరద్‌ పవార్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎవరికి ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని రౌత్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.


శివసేనతో కలిసి ఎన్.సి.పి, కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయవచ్చన్న ఊహాగానాల తరుణంలో.. శరద్‌  పవార్‌ సోనియాతో భేటీ అయ్యారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనంటూ ఎన్.సి.పి ఇప్పటికే సంకేతాలు పంపింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ కూడా బీజేపీ నాయకత్వంతో చర్చించారు.  సీఎం పదవి పంచే ప్రసక్తే లేదనీ అయితే ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం విషయంలో శివసేనకు డోర్ లు తెరిచే ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.


అటు మహా సంక్షోభంలో జోక్యం చేసుకోవాలని ఆర్.ఎస్.ఎస్  చీఫ్ మోహన్ భగవత్ కు శివసేన నేత లేఖ రాయడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పంపిస్తే.. ఈ సమస్యను రెండు గంటల్లో పరిష్కరిస్తారని పేర్కొనడం కూడా చర్చనీయాంశమైంది. శివసేన మొండికేస్తే.. మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికి అభ్యంతరం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి మహారాష్ట్ర రాజకీయాలు ఎంతవరకు దారితీస్తాయో.. ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎపుడు తెరపడుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి: