యువతలో చాలామంది చదువు పూర్తయిన తరువాత ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో కష్టపడతారు. అలా కష్టపడి కొందరు
జాబ్ సాధిస్తే మరికొందరు మాత్రం ఉద్యోగం సాధించటంలో విఫలమవుతారు.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలోని బోయపల్లి గ్రామానికి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్నోసార్లు ప్రయత్నించి ఉద్యోగం సాధించటంలో విఫలమైన నిరుద్యోగులు వచ్చి రాజమల్లు ఇంటిలో చదువుకుంటే మాత్రం ఉద్యోగం సాధించారు.
2007 సంవత్సరంలో బోయపల్లి గ్రామానికి చెందిన నలుగురు స్నేహితులు రాజేశ్,
భాస్కర్, మల్లేశ్, సంతోశ్ ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ప్రిపరేషన్ కొరకు ఒక మంచి ఇంటి కోసం వెతికిన వీరికి రాజమల్లు అనే వ్యక్తి ఇల్లు ఖాళీగా ఉందని తెలిసింది. ప్రతిరోజు ఆ ఇంటికి వెళ్లి చదివిన నలుగురు స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఒకే ఇంట్లో చదువుకున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు రావటానికి ఆ ఇల్లే కారణమని నమ్మారు.
ఈ వార్త వైరల్ అవటంతో ఆ ఇంటికి క్రేజ్ పెరిగింది. ఆ గ్రామంలోని చదువు పూర్తయిన యువకుల తల్లిదండ్రులు ఆ ఇంట్లో చదవమని వారి పిల్లలకు చెబుతారు. ఇప్పటివరకు ఆ ఇంట్లో చదివిన 48 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఎంతో గొప్ప పేరు ఉన్న కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వస్తాయో లేదో చెప్పలేము కానీ ఈ ఇంట్లో చదివితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం ఇక్కడ ఉచితంగా కోచింగ్ తీసుకున్నవాళ్లు ఉద్యోగాలు సాధించటంతో బలపడింది.
ఈ ఊరికి మరో ప్రత్యేకత కూడా ఉంది. చదువుకున్నవారు ఉన్న ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం సాధించటం గమనార్హం. ఆ ఊర్లో ఉన్న యువకులు అందరూ కలిసి కొంత డబ్బు వేసుకొని ప్రభుత్వ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అన్నీ కొని ఆ ఇంట్లో ఉంచారు. ఆ ఇంటి యజమాని రాజమల్లు మాట్లాడుతూ నా ఇంట్లో చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. తన ఇంటి గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకోవటం ఎంతో ఆనందంగా ఉందని రాజమల్లు అన్నాడు.