ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం
జగన్ లేఖ రాశారు.
ఏపీ జెన్కోకు బొగ్గుక్షేత్రాలను కేటాయించాలని అందులో విన్నవించారు. బొగ్గు కొరతతో డిమాండ్కు సరిపడా
విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడం లేదని
దీంతో రాష్ట్రంలో కరెంట్ కోతలు విధించాల్సి వస్తోందని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన ఉత్పత్తి కోసం తగినన్ని బొగ్గు క్షేత్రాలు కేటాయించాలంటూ
ప్రధాని మోదీకి
ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు.
2014లో ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఏపీకి కేటాయించలేదని మోదీకి
జగన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఆధారపడుతున్న విషయాన్ని
ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
దీనివల్ల విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయిందని లేఖలో ప్రస్తావించారు. ఒడిశాలోని మందాకిని, తాల్చేరు, అంగుల్ బొగ్గు క్షేత్రాలను
ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని కోరారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ఇచ్చిన సింగరేణి కాలరీస్ బొగ్గు నిల్వల్లో ఏపీకి కనీస వాటా ఇవ్వలేదని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం బొగ్గు కోసం ఇతర రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని... దీనివల్ల విద్యుత్ రంగంలో భరోసా లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు తీవ్ర అవరోధంగా ఏర్పడుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో
2020 మార్చి నాటికి 16 వందల మెగావాట్ల అదనపు విద్యుదుత్పాదనకు
ఏపీ జెన్కో సిద్ధమవుతోందని... ఆ లక్ష్యం నెరవేరాలంటే ఏటా 7.5 ఎమ్ఎమ్టీఏల బొగ్గు నిల్వలు అవసరమవుతాయన్నారు.
కొత్త లక్ష్యాలు చేరుకోవటంతోపాటు పాత ఉత్పత్తి యథాతధంగా కొనసాగాలంటే ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి ఏడాదికి కనీసం 50 ఎమ్ఎమ్టీఏల బొగ్గు కేటాయించాలని సీఎం లేఖలో విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో ఒక్కో గని ఏపీఎండీసీకి కేటాయించారు. కానీ ఈ గనుల నుంచి బొగ్గు వెలికి తీయడానికి నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటోంది. బొగ్గు గనుల చట్టం–2015 ప్రకారం
కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ట్రాంచీ –6ను ఏపిజెన్కో కోసం కేటాయించింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వశాఖకు ఏపీజెన్కో దరఖాస్తు చేసుకుంది.