ఇసుక మీద యుద్ధం చేస్తున్న విపక్షాలు ఒక్కసారిగా రాజధాని అంశంపై చర్చలు మొదలెట్టాయి. అయినా.... విపక్షాలవి వ్యక్తిగత విమర్శలంటూ వైసీపీ కొట్టిపారేస్తుంది.ఏపీ రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌  హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఊపందుకుంది.


ఈ నేపథ్యంలో రాజధాని కోసం జగన్‌ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటుచేస్తే- పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చుగా అంటూ పవన్‌ కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.అమరావతిని మార్చవద్దంటూ గతంలోనే డిమాండ్‌ చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి.  పవన్‌ వ్యాఖ్యలకు వైసీపీ ఘాటుగా కౌంటర్‌ ఇస్తోంది. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తుండటం మంచిది కాదంటూ మంత్రి అవంతి శ్రీనివాస్‌ హితవు పలికారు. రాజధానిపై రాజకీయం మానుకోవాలని మంత్రి జనసేనానికి సూచించారు.    మరోవైపు- అమరావతి అనే బంగారుబాతును తయారు చేస్తే దాన్ని చంపేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.   


రాజధాని పరిణామాలపై ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసిన టీడీపీ.. నిపుణుల కమిటీ ఏర్పాటును తప్పుబడుతోంది. ఈ కమిటీతో ఏం చేస్తారని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేసుల్లో ఉన్నవారు- అమరావతిలో అవినీతి గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు విమర్శలకు వైసీపీ మంత్రి బొత్స కౌంటర్‌ ఇచ్చారు. కేంద్రం కొత్తగా విడుదల చేసిన మ్యాప్‌లో అమరావతికి స్థానం లేదన్న విషయం ప్రస్తావించారు. తాను ఈ విషయం గతంలో చెప్పానంటున్నారు బొత్స. మరోవైపు బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా రాజధాని తరలింపు ఆలోచనను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు కన్నా.


ఇసుక విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన విపక్షాలు- అమరావతిపై కొత్తగా విమర్శలు మొదలుపెట్టడంతో- ఏపీ పాలిటిక్స్‌ మరో మలుపు తిరిగాయి.పవన్‌ సెటైర్లు, చంద్రబాబు ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం కౌంటర్లతో సరిపెడుతుందా, రాజధానిపై క్లారిటీ ఇస్తుందా అనేది చర్చనీయాంశం.  రాజధాని విషయంలో ఇలా ప్రభుత్వం మీద కొత్తగా దాడి మొదలు పెట్టడంలో ఏమైనా వ్యూహముందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: