జనసేన పార్టీలో
పవన్ మినహా పెద్దగా క్రేజ్ ఉన్న నాయకులు లేరనే చెప్పాలి. కొద్దోగొప్పో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కొంచెం గట్టి వాయిస్ వినిపించగలగడు. ఇక మిగతా వారికి అంత స్కోప్ లేదనే చెప్పాలి. కానీ
పవన్ తర్వాత మంచి ఫాలోయింగ్ ఉంది మాజీ
సీబీఐ జేడీ లక్ష్మినారాయణకే. పదవిని వదులుకుని ప్రజలకు
సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన జేడీ ఎన్నికల ముందు జనసేనలో చేరి
విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే.
అయితే ఓటమి తర్వాత నుంచి పార్టీలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. కానీ తాజాగా
విశాఖ జనసేన ఆధ్వర్యంలో జరిగిన
లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు. అందులో ఆయన స్పీచ్ కూడా బాగా ఆకట్టుకుంది కూడా. దీంతో ఇక నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉంటారని జేడీ సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే
పవన్ జేడీని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు. అది కూడా జేడీకి
రాయలసీమ బాధ్యతలు అప్పగించి....అక్కడ పార్టీ బలోపేతం చేయాలని చూస్తున్నారు.
మామూలుగా జనసేనకు కోస్తాలో కొంత పట్టు ఉంది గానీ...రాయలసీమలో అంత సీన్ లేదు. ఇక్కడ వైసీపీకి చాలా బలంగా ఉంది. ఒకవేళ
వైసీపీ అధికారంలో లేకపోయిన ఇక్కడ మాత్రం మెజారిటీ సీట్లు సాధించగలదు. అదే విషయం 2014 ఎన్నికల్లో రుజువైంది. మొన్న ఎన్నికల్లో అయితే మూడు సీట్లు తప్ప నాలుగు జిల్లాలో 49 సీట్లు గెలిచేసింది. ఇక
వైసీపీ తర్వాత, టీడీపీకి మంచి బలం ఉంది. ఈ రెండు పార్టీలకు ధీటుగా అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి పవన్...జేడీని వాడనున్నారు.
అయితే ముందు నుంచి జేడీ
రాయలసీమ సమస్యలపై ఫోకస్ చేస్తూనే వస్తున్నారు. పదవికి
రాజీనామా చేశాక రాయలసీమలోని జిల్లాలో పర్యటించి పలు సమస్యలు కూడా తెలుసుకున్నారు. పైగా ఎన్నికల్లో కూడా అనంతపురం లేదా హిందూపురంలో పోటీ చేద్దామనుకున్నారు. కానీ విశాఖలో జనసేనకు కొంచెం పట్టు ఉండటంతో అక్కడ బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక దీంతో జేడీని రాయలసీమకే పంపాలని
పవన్ ఫిక్స్ అయ్యారు. ఇప్పటి నుండే అక్కడ బాధ్యతలు అప్పగిస్తే.. భవిష్యత్ లో మేలు చేస్తుందని
పవన్ అంచనగా కనిపిస్తోంది. అందుకే అక్కడ పార్టీకి మార్గదర్శనం చేయడానికి, ముందుకు నడిపించడానికి బాధ్యతలు తీసుకోవాలని పవన్ ఆయనకు సూచించారు. మరి రెండు బలమైన పార్టీల మధ్య జేడీ జనసేనని ఏ విధంగా బలోపేతం చేస్తారో చూడాలి.