ఆంధ్రప్రదేశ్ లో మరో సారి ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి పార్టీలు సమాయత్తమయ్యే సమయం వచ్చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరో మూడు నెలల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. స్థానిక సంస్థలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టుకు నివేదించారు.


అయితే మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధిత ఉన్నతాధికారి ద్వారా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.


పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో టీడీపీ ,జనసేన,బీజేపీ సర్వం  సన్నద్ధమవుతున్నాయి. ఇసుక కొరత, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం తదితర అంశాలపై ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ సమయంలో ఎన్నికలు వస్తే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, సచివాలయ వ్యవస్థ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన తదితర అంశాలు కలిసి వస్తాయని అధికార వైఎస్సార్సీపీ భావిస్తోంది.


ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ గతంలోనే ప్రకటించారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08, ఎస్టీలకు 6.77 శాతం కోటా ఉంటుందని చెప్పారు. రిజర్వేషన్లపై రాజ్యంగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న వాదనలున్నాయి. ఎన్నికల నాటికి ఇబ్బందులను అధిగమించి స్థానిక పోరులోనూ సత్తాచాటాలని అధికారం లో ఉన్న వైస్సార్సీపీ పార్టీ ఆశ పడుతుంది .  



మరింత సమాచారం తెలుసుకోండి: