ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఎల్లంకి సింహాద్రి గతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. అతడికి శివ అనే పేరు కూడా ఉంది. ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసిన ఆయన.. అనంతరం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఎదుటి వారిని మోసం చేయడం మొదలు పెట్టాడు. తన దగ్గర అసాధారణ శక్తులు ఉన్న దేవతల విగ్రహాలు, పురాతన నాణేలు ఉన్నాయని జనాలను నమ్మించాడు.


అవి మీ దగ్గర ఉంటే తిరుగుండదని చెప్పి.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎర వేసేవాడు. వాటిని ఇవ్వడం కోసం డబ్బు, బంగారం వసూలు చేసేవాడు. నమ్మిన వాళ్లు అతడికి బంగారం, డబ్బులు ఇచ్చాక సైనేడ్ కలిపిన ప్రసాదం ఇచ్చేవాడు. అది తినగానే వారు ప్రాణాలు వదిలేవారు. వారి దగ్గర్నుంచి సొమ్ము తీసుకొని అక్కడి నుంచి జారుకునేవాడు.
 
అక్టోబర్ 16న ఏలూరు సమీపంలోని వట్లూరులో పీఈటీ అయిన కాటి నాగరాజు(49) దగ్గర్నుంచి రూ. 2 లక్షల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. అనంతరం ప్రసాదంలో సైనేడ్ కలిపి ఇవ్వడంతో.. తిన్న కాసేపటికే వట్లూరు పాలిటెక్నిక్ కాలేజీ సమీపంలో.. రోడ్డు పక్కనే నాగరాజు ప్రాణాలు వదిలారు. తొలుత నాగరాజు గుండెపోటుతో చనిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కానీ ఆయన దగ్గర ఉండాల్సిన నగదు, నగలు లేకపోవడంతో అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 కేసు నమోదు చేసి పోలీసులు దర్యాఫ్తు చేపట్టగా.. సీరియల్ కిల్లర్ సింహాద్రి పేరు వెలుగులోకి వచ్చింది. అతణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో 2018 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 20 నెలల్లో 10 మందిని మట్టుబెట్టాడని గుర్తించారు. ఎవరికీ అనుమానాలు రాకుండా నిందితుడు తన కార్యకలాపాలు సాగించేవాడని తెలిపారు. విజయవాడకు చెందిన షేక్ హమీనుల్లా అతడికి సైనేడ్ అందించాడని గుర్తించారు. సింహాద్రితోపాటు షేక్‌ హమీనుల్లా‌ను అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: