టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యక్ర‌మాల్లో భాగంగా త‌న పెద్ద‌మ‌న‌సు చాటుకున్నారు. వివిధ కార‌ణాల‌తో క‌న్నుమూసిన‌ టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలకు తెలంగాణ భవన్ లో బీమా చెక్కులు కేటీఆర్ తాజాగా అందించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ``మీ కుటుంబ పెద్ద మనలో ఈరోజు లేకపోయినా, మనతో ఈరోజు లేకపోయినా, పార్టీ మాత్రం మీకెప్పుడు అండగా ఉంటదనే విశ్వాసం మీలో నింపాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని కొంత శ్రమ పెట్ట‌యినా సరే, కొంత ఇబ్బంది అనిపించినా సరే ఇక్కడికి రావాలని ఆహ్వానించడం జరిగింది.  మీకు ఈ ఒక బీమా ఇవ్వడంతోనే మీతో మా అనుబంధం తీరిపోయిందనే మాట పొరపాటున కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉంటయ్. చాలా కష్టాలు ఉంటాయని. అన్నింటిలోనూ మీకు పార్టీ అండగా ఉంటుంది` అని కేటీఆర్ పేర్కొన్నారు.


బీమా కింద 1,581 మంది కార్యకర్తల కుటుంబాలకు రూ. 31కోట్ల 62 లక్షలు చెల్లించామని కేటీఆర్ తెలిపారు. ``ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మిమ్ములను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా, పార్టీ తరపున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. టీఆర్‌ఎస్‌ పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణం, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదు. 60 లక్షల మంది కార్యకర్తలను సీఎం కేసీఆర్‌ గారు మనసున్న నేత, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి. కుటుంబ పెద్దగా ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను వారు కడుపులో పెట్టి చూసుకుంటారు`` అని తెలిపారు.


కార్య‌క‌ర్త‌ల కుటుంబాల‌కు ఎక్కడ చెక్కు ఇవ్వాల్సి వచ్చినా నాయకులే ఆ ఇంటికి వెళ్లి చెక్కు ఇచ్చి, వారికొక విశ్వాసాన్ని కల్పించి, వారి కష్టం కాని, వారి సుఖం కాని తెలుసుకుని వారికింకా ఏమన్నా ఇబ్బందులుంటే కూడా, ఇక్కట్లు ఉంటే కూడా తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కృషిచేయాలని కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. ``పార్టీ నాయకులు, మన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు .. ఎక్కడికక్కడ, ఎవరి నియోజకవర్గాలకు వారు తప్పకుండా చెక్కు ఇచ్చే సందర్భంగా రొటీన్ గా చెక్కు పోయినట్లు కాకుండా పార్టీ తరఫున కార్యక్రమాన్ని కూడా ఒకటి వ్యవస్థీకృతం చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా శాశ్వతంగా ఒక అనుబంధం ఆ కుటుంబానికి, మనకు ఉంటుంది. ఆ కుటుంబం కూడా మా కుటుంబ పెద్ద చేసిన పనికి పార్టీ గుర్తించింది అన్న భావనతో ఉంటారు`` అని తెలిపారు.
``ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు. సాధించుకున్న ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వర్గాలను రైతులే కాని, పేదలే కాని, ఇంకా మహిళలే కాని, ఇతరులే కాని, కార్మికులే కాని, అందరినీ కూడా బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్న ఉద్దేశ్యంతో ఒక దృఢచిత్తంతో, దృఢ సంకల్పంతో పని చేస్తున్న నాయకుడు మన కేసీఆర్‌. అలాంటి నాయకుడి నాయకత్వాన ఉన్న ఈ పార్టీలో మనందరం ఆయన కుటుంబసభ్యులుగా ఉండడం సంతోషం`అని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం కార్యకర్తల కుటుంబ సభ్యులతో విడివిడిగా కలుసుకొని వారి సమస్యలు పూర్తిగా విన్నారు. చివరగా అందరితో కలిసి కేటీఆర్ భోజనం చేయడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: