సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో చెప్పిన ప్రతీ హామీని తప్పకుండా నిలబెట్టుకుంటు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ దశలోనే రైతులందరికి లబ్ది చేకూరేలా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పధకాన్ని ప్రవేశ పెట్టారు. ఇక నవరత్నాలలో భాగంగా చేపట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకం అమలుపై బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు..
ఈ క్రమంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ పధకం అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం మండల, డివిజన్, జిల్లా కేంద్రాల వారీగా ఈనెల 9వ తేదీన ప్రత్యేకంగా ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల, కౌలు రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని, అంతే కాకుండా రైతు భరోసాకి సంబంధించి సందేహాలను తీర్చాలని స్పష్టం చేశారు.. రెండో శనివారం సెలవులు వచ్చినప్పటికి అన్నదాతల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఏ ఒక్కరికీ పథకం ద్వారా లబ్ధి చేకూరలేదనే విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఇకపోతే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించే గడువును డిసెంబర్ 15 వరకు పెంచాలని, రైతుల సందేహాలను తీర్చేందుకు ప్రత్యేకంగా హెల్ప్లైన్ ఏర్పాటు చేయడమే కాకుండా సాధారణ రైతులకు నవంబర్ 15లోగా రైతు భరోసా సాయాన్ని అందించాలని సూచించారు.
ఇకపోతే రైతు భరోసా పథకం అర్హులైన ప్రతి రైతుకు అందాలని ఈ నేపథ్యంలోనే సమస్యలను పరిష్కరించేందుకు శనివారం ప్రత్యేకంగా రైతు భరోసా పథకంపై స్పందన కార్యక్రమం నిర్వహించడం వల్ల కనీసం దీని ద్వారా మరో 5 లక్షల మంది భూ యజమానులైన రైతులకు రైతు భరోసా పథకం వర్తిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు... ఈ పధకం సరైన దిశగా రైతులకు చేరితే అన్నదాత ఆత్మహత్యలు చేసుకోకుండా ఆనందంగా జీవిస్తాడని. అందుకే ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలను తీసుకోవాలని జగన్ ఆదేశించారు.