కర్తార్ పుర్ యాత్రికులకు పాస్ పోర్టు తప్పనిసరని పాకిస్థాన్ స్పష్టం చేసింది. గురుద్వారా దర్బార్ సాహిబ్ ను దర్శించుకునే భారతీయులకు పాస్ పోర్టు అవసరం లేదని, కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. కానీ పాస్ పోర్టు ఉండాల్సిందేనని తాజాగా పాక్ ఆర్మీ స్పష్టం చేసింది.


సిక్కుల మత గురువు గురునానక్ పుణ్యక్షేత్రమైన గురుద్వారా దర్బార్ సాహిబ్‌ ను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతీ సిక్కు మతస్థుడు భావిస్తాడు. పాకిస్థాన్ పంజాబ్ నారోవాల్ జిల్లాలో దర్బార్ సాహిబ్ పుణ్యక్షేత్రం ఉంది. భారతీయ సిక్కులు దర్బార్ సాహిబ్ ను సులభంగా సందర్శించుకోవడానికి కర్తార్ పూర్ కారిడార్‌ ను నిర్మించారు. దీనిని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 9న ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ ద్వారా తొలి విడత బృందం నవంబర్ 9న బయలుదేరనుంది. తొలి విడత యాత్రీకుల బృందంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు హర్తీప్ పూరి, హర్ సిమ్రత్ కౌర్ బాదల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యే ఉన్నారు.


అయితే కర్తార్ నడవా మీదుగా గురుద్వారా దర్బార్ సాహిబ్ ను దర్శించుకునే భారత యాత్రికులకు పాస్ పోర్టు అవసరం లేదని, కేవలం గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుందని గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అంతేకాదు కర్తార్ పూర్ దారి ప్రారంభం రోజున, గురునానక్ దేవ్ జయంతి రోజున యాత్రికులకు సర్వీసు ఫీజు కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సిక్కు యాత్రికులకు పాస్ పోర్టు అవసరమా? లేదా? అనే విషయంపై పాక్ స్పష్టత ఇవ్వాలని భారత్ అడిగింది. దీనిపై ఆ దేశ ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ స్పందిస్తూ.. భారత సిక్కు యాత్రికులకు పాస్ పోర్టు ఉండాల్సిందేనని తెలిపినట్టు పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. పాక్ భూభాగంలోకి వచ్చే ప్రతి ఒక్కరు న్యాయపరంగా రావాల్సిందేనని, భద్రతాపరమైన కారణాల రీత్యా పాస్ పోర్టు ఆధారంగానే ఎవరినైనా దేశంలోకి అనుమతిస్తామని పాక్ అంటోంది. పాకిస్థాన్ యూటర్న్ పై భారతీయ సిక్కులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


కర్తార్ పుర్ కారిడార్‌ ను ఈ శనివారం ప్రారంభించనున్నారు. పాక్ లోని సరోవల్ జిల్లా గురుద్వారా దర్బార్ సాహిబ్ ను పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ తో ఈ దారి  అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో రోజుకు 5వేల మంది యాత్రికులను అనుమతించనున్నారు. మరోవైపు కర్తార్‌ పూర్‌ ప్రారంభం రోజున పాకిస్థాన్ లో సిద్దూ పర్యటనకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా లేదా అనే అంశం ఇంకా తేలలేదు. గత ఆగస్టులో ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న సిద్దూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ ని కౌగిలించుకుని విమర్శలకు గురయ్యాడు. ఇప్పటికే పాకిస్తాన్‌ సిద్దూకు వీసా మంజూరు చేసింది. కానీ కేంద్రం అనుమతిస్తుందా లేదా అనే అంశంలో స్పష్టత రాలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: