మహిళా మేయర్‌ ని  ప్రతిపక్షానికి చెందిన నిరసనకారులు వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్లి, ఆమె ఒంటి నిండా ఎర్ర రంగు పూసి, బలవంతంగా జుట్టు కత్తిరించిన ఘటన  బొలీవియాలో చోటుచేసుకుంది. అధికార మాస్ పార్టీకి చెందిన పాట్రీసియా ఆర్స్‌ను దాడి తర్వాత స్థానిక వింటో పోలీసులకు అప్పగించారు. వివాదాస్పదంగా మారిన అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రభుత్వ, ప్రతిపక్ష మద్దతుదారుల మధ్య జరిగిన వరుస ఘర్షణల్లో ఇదొకటి.ఈ ఘర్షణల్లో ఇప్పటివరకూ ముగ్గురు పౌరులు మరణించారు.


అక్టోబర్ 20న జరిగిన అధ్యక్ష ఎన్నికల అనంతరం జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా వింటోలోని ఓ బ్రిడ్జిని ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల బృందం బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. అక్కడికి సమీపంలో ప్రస్తుత అధ్యక్షుడు ఇవో మొరేల్స్ మద్దతుదారులతో జరిగిన ఘర్షణల్లో ప్రతిపక్ష నిరసనకారుల్లో ఇద్దరిని చంపేశారనే వదంతులు వ్యాపించాయి. దీంతో వీరిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.మేయర్ ఆర్స్ ప్రభుత్వ మద్దతుదారులతో కలిసి తాము చేస్తున్న బ్రిడ్జి దిగ్బంధాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, తమలోని ఇద్దరు వ్యక్తుల మరణానికి ఆమే కారణమని నిరసనకారులు ఆరోపించారు. తర్వాత విచారణలో ఒక వ్యక్తి మరణించారని స్పష్టమైంది.

'హంతకురాలు, హంతకురాలు' అంటూ నినాదాలు చేస్తూ, ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు ఆమెను కనీసం చెప్పులు కూడా లేకుండా వీధుల్లో నుంచి ఈడ్చుకుంటూ బ్రిడ్జి దగ్గరకు తీసుకొచ్చారు. ఆమెను మోకాళ్లపై కూర్చోపెట్టి, బలవంతంగా జుట్టు కత్తిరించి, ఎర్రరంగు ఆమెపై చల్లేశారు. రాజీనామా చేయాలని కూడా బలవంతపెట్టారు.ఆ తర్వాత ఆమెను స్థానిక పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టగా, పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.ఆమె కార్యాలయాన్ని దగ్ధం చేసి, టౌన్ హాల్ కిటికీలను ధ్వంసం చేశారు.ఎన్నికల ఓట్ల లెక్కింపు 24 గంటల పాటు నిలిపేయడంతో ఆరోజు రాత్రి నుంచి ఆందోళనలు చెలరేగాయి.

ఈ నిలుపుదల ప్రతిపక్ష అభ్యర్థి కార్లోస్ మెసా వర్గంలో అనుమానాలకు కారణమైంది. 2006 నుంచి అధ్యక్షుడిగా ఉన్న మోరేల్స్‌కు అనుకూలంగా ఫలితాలను తారుమారు చేస్తున్నారని వారికి సందేహాలు రేకెత్తాయి.తుది ఫలితాల్లో మోరేల్స్ అవసరమైన మెజారిటీ కన్నా కేవలం 10శాతం పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారని వెల్లడైంది.ఈ ఎన్నికలపై ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సందేహాలు వ్యక్తం చేయగా, దీనిపై ఆడిట్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాల వెల్లడిలో తాను లేదా తన పార్టీ ప్రమేయం లేదంటూ మోరేల్స్ ఈ ఆడిట్‌ను వ్యతిరేకిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: