చెట్టు ఆకాశమంత ఎత్తుకు ఎదగొచ్చు.. కానీ దాని వేళ్లు మాత్రం భూమిలోనే ఉంటాయి. ఇదే సామెత చాలామంది గొప్పవాళ్లకు వర్తిస్తుంది. స్వయంకృషితో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. కానీ చాలామంది హృదయం మాత్రం జన్మభూమి మీదనే ఉంటుంది. సొంత గ్రామం విడిచి ఉపాధి కోసమో, వ్యాపారం కోసమో దేశ విదేశాలకెళ్లినా మనసు మాత్రం ఇంకా గ్రామాన్ని వదిలి పెట్టదు.
అందుకే చాలా మంది సొంత గ్రామాభివృద్ధి పాలుపంచుకుంటుంటారు. అలాంటి వారి కోసం ఏపీ సర్కారు కూడా ఓ కొత్త పథకం రూపొందించింది. అదే కనెక్ట్ టు ఆంధ్రా. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ వెబ్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. దీనికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చైర్మన్గా, సీఎస్ వైస్ ఛైర్మన్గా వ్యవహరిస్తారు.
వెబ్ పోర్టల్ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయవచ్చు అని అన్నారు. ‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యం కాదు.
మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి, మీ జిల్లాలో ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. దానికి ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతోకొంత మంచి చేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్కుమార్, ప్రణాళికా సంఘం డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్ఆర్టీ ఛైర్మన్ మేడపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇంకేం మీ గ్రామానికి మీవంతు సాయపడండి.. ఆత్మసంతృప్తి పొందండి.