తెలంగాణాలో గత 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ఆర్టీసీ ఐకాస, విపక్షాలు సకల జనుల సామూహిక దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు 170 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగర సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. 

                                       

కొందరు ఐకాస నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీకుల చెందిన నేతలను శుక్రవారమే అరెస్టు చేశామని ఆయన చెప్పారు. ట్యాంక్ బండ్‌పై వాతావరణం ప్రశాంతంగా ఉందని అంజనీకుమార్‌ వెల్లడించారు. కాగా తెలంగాణాలో ఒక వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె గొడవలు ఉంటె మరో వైపు దేశ వ్యాప్తంగా  చర్చనీయాంశమైన అయోధ్యలో రామమందిరం- బాబ్రీమసీదు కేసుపై సుప్రీం తీర్పు వెల్లడించిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

                                        

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సభలు, సమావేశాలు, నిరసనలకు అనుమతి లేదని అంజనీ కుమార్ స్పష్టం చేశారు. సున్నిత ప్రదేశాల్లో పోలీస్ పికెట్‌ ఏర్పాటు చేశామని అయన తెలిపారు. కాగా ఈ ఆదివారం మిలాద్ ఉన్ నబీ ర్యాలీ దృష్ట్యా అన్ని జోన్లలో బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ అంజనీ కుమార్ వివరించారు. ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఆందోళనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: