ఉద్యమం ఊపిరిపోసుకుందంటే ఎన్ని సంకెళ్లతో బంధించిన, ఎంతగా అణిచేయాలని ప్రయత్నించిన ఆగదు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఛలో ట్యాంక్బండ్ కార్యక్రమం ఇప్పుడు ఇలాగే విజయవంతంగా ముగిసింది. నిర్భందాలను లెక్కచేయలేదు, పోలీసు బెదిరింపులను చెవికెక్కించుకోలేదు. తమ లక్ష్యం ట్యాంక్ బండ్పై చేరుకోవటం అని పంతం పట్టిన ఆర్టీసీ కార్మికులు, మద్దతుదారులు భారీగా ట్యాంక్బండ్కు చేరుకున్నారు.
ఓ వైపు పోలీసులు ట్యాంకు బండ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకొని… ఎవరూ రాకుండా జల్లెడపడుతున్న వందలాది మంది నిరసన కారులు ట్యాంక్బండ్పైకి చేరుకొని, సీఎం కేసీఆర్కు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి మరో ఉద్యమం ఉప్పెనల్లె మొదలైయ్యిందని నిరూపించారు. ఈ క్రమంలో అంతమంది కార్మికులు ఎక్కడి నుండి వస్తున్నారో అర్థంకాక పోలీసులు అయోమయానికి గురయ్యారు.
సచివాలయం వైపు నుండి. ట్యాంక్ బండ్వైపు నుండి కొంతమంది కార్మికులు పరుగులు పెడతూ.. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులతో తోపులాట జరిగింది. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేస్తూ అక్కడి నుండి తరలించారు. అయితే కార్మికులు గుంపులు గుంపులుగా ఇంకా ట్యాంక్బండ్ వద్దకు చేరుకున్నారు.
ఇకపోతే ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోగా, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందని ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ‘చలో ట్యాంక్బండ్’ కార్యక్రమానికి విపక్షాలు మద్దతు పలికాయి. అందువల్ల విపక్ష నాయకులు ఎవరూ ట్యాంక్బండ్ పరిసరాలలోకి వెళ్లకుండా పోలీసులు నాయకులను వారివారి ఇళ్ల వద్దనే హౌస్ అరెస్టులు చేశారు.
ఇకపోతే చలో ట్యాంక్బండ్ కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నేతలు డీకే. అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన డీకే. అరుణ మాట్లాడుతూ.. ఆర్టీసీ జేఏసీ నిర్వహించదలచిన మిలియన్ మార్చ్ను నిర్బంధాలతో అడ్డుకోలేరని ఆమె అన్నారు. కేసీఆర్ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నాడని ఆమె మండిపడ్డారు. పోలీసులు నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసినా మిలియన్ మార్చ్ ఏమాత్రం ఆగలేదని, ఈ కార్యక్రమ లక్ష్యం నెరవేరిందని ఆమె పేర్కొన్నారు.