ఆన్లైన్ మోసాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువు వస్తుందో రాదో తెలియదు. వచ్చినా దానికి గ్యారంటీ ఉండదు. అసలు ఏరకంగా చూసుకున్న ఆన్లైన్ వస్తువులు శుద్ద వేస్ట్ అని తెలిసి కూడా జనం ఎగబడుతున్నారు.
ఇప్పటికే ఎన్నోసార్లు ఆన్లైన్లో ఓ ఐటెం బుక్ చేస్తే మరో ఐటెం రావడం లేదా రాళ్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు వెళ్లి ఆ పంపినవాన్ని దబాయిద్దాం అంటే వాడెక్కడుంటాడో తెలియదు. ఇదే తప్పు ఒక షాపువాడు చేసాడంటే ముందు వెనుక ఆలోచించకుండా వాన్ని నోటికి వచ్చినట్లుగా వాయిస్తారు. షాపు మీదికి దండెత్తుతారు కూడా.
ఇకపోతే ఓ యువకుడు తనకు వచ్చిన పార్శిల్ ఆనందగా ఓపెన్ చేసి చూడగా అందులో సెల్ఫోన్కు బదులుగా బట్టలు వచ్చాయి. అంతే ఆనందం ఆవిరైంది. ఎంతో ఉత్సాహంతో ఆన్లైన్లో సెల్ఫోన్బుక్ చేసుకున్న ఆ యువకుడికి నిరాశే మిగిలింది. ఆర్డర్ను తీసుకున్న ఆ సంస్థ పంపించిన పార్సిల్ను తెరిచిన అతనికి బట్టలు దర్శనమివ్వడంతో నిర్ఘాంతపోయాడు.
ఈ ఘటన వెలుగు చూసింది ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం ముత్యంపేటలో . ముత్యంపేటకు చెందిన సిడాం భీంరావ్ ఆన్లైన్లో సెల్ ఫోన్ను ఆర్డర్ చేశాడు. నెల రోజుల తర్వాత స్థానిక పోస్టాఫీసుకు పార్సిల్ రావడంతో.. రూ.4,499 చెల్లించి దానిని తీసుకున్నాడు. తీరా ఆ డబ్బాను తెరిచి చూస్తే సెల్ఫోన్కు బదులు బట్టలు కనిపించడంతో బిత్తరపోయాడు.
అయితే తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఫిర్యాదు చేశాడు. ఇలాంటి మోసాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైనాయి అయినా ఆన్లైన్ బిజినెస్ మాత్రం తమ ఉనికిని కోల్పోవడం లేదు. తమ బిజినెస్ కార్యకలాపాలను మాత్రం విజయవంతంగా నిర్వహిస్తూ కోట్లాది రూపాయల బిజినెస్ చేసుకుంటుంది..