మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గంట గంటకు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్‌.. ఉన్నట్టుండి అనూహ్య ప్రకటన చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అంటూ.. అందర్నీ ఆశ్చర్యపర్చింది. అయితే.. అంతిమ నిర్ణయం సోనియాదే అంటూ కండీషన్‌ కూడా పెట్టింది. ఇటు శివసేన కూడా కాంగ్రెస్‌తో విబేధాలు లేవని చెబుతోంది. 


మహారాష్ట్ర బలపరీక్షకు గట్టిగా 24 గంటలు కూడా లేదు. చేతిలో ఉన్నవి 44 సీట్లు మాత్రమే. మ్యాజిగ్ ఫిగర్‌ను చేరుకోవాలంటే ఇంకా 101 ఎమ్మెల్యే మద్ధతు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది కాంగ్రెస్‌. శివసేనకు మద్ధతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. బలనిరూపణలో బీజేపీ విఫలమై తమని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గర్నర్‌ను కోరింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసిన అధిష్టానం... వారితో చర్చలు జరిపింది.  అయితే  శివసేనకు మద్దతివ్వాలని మెజారిటీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. 


అయితే.. ఖర్గే మాత్రం ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నారు. అయితే శివసేనకు మద్దతిచ్చే అంశంపై నిర్ణయాన్ని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీకి అప్పగించినట్లు తెలిపారు. బీజేపీతో దూరం పెరగడంతో శివసేన ఎన్‌సీపీకి దగ్గరయ్యింది. సంజయ్‌ రౌత్‌ షరద్‌ పవర్‌ ఇంటికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఆ తర్వాత పవర్‌ సోనియాతో డిస్కస్ చేయగా... ప్రతిపక్షంలోనే కూర్చుంటామని తెల్పింది. దీంతో పవర్ కూడా ఐదేళ్లు విపక్షంలో ఉంటామని చెప్పారు. ఇంతలోనే డెడ్‌లైన్‌ ముగిసిపోవడం... గవర్నర్‌ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో... కాంగ్రెస్‌, శివసేన అప్రమత్తమయ్యాయి. బీజేపీకి బలనిరూపణలో విఫలమయ్యే అవకాశాలు ఉండటంతో.. చేతికందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాయి పార్టీలు. 


శివసేన సైతం కాంగ్రెస్‌తో ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్ధవ్‌థాక్రె పేరును కూడా ప్రకటించింది. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపాదన చేశారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే దాన్ని నడిపే సామర్ధ్యం ఉద్ధవ్‌కే ఉందన్నారు. అయితే  ఇంతవరకూ ఎన్‌సీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాంగ్రెస్‌ శివసేనకు మద్ధతు ఇస్తే..పవర్‌ కూడా మద్ధతు తెలిపే అవకాశం ఉంది. అదే జరిగితే... శివసేన ఈజీగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదంత జరగాలంటే... కాంగ్రెస్‌ మద్ధతు కీలకం. దీంతో టెన్‌జన్‌పథ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అన్నది సస్పెన్స్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: