మగ బిడ్డ కోసం కట్టుకున్న భర్తకు దగ్గరుండి మరీ
పెళ్లి చేసిందో భార్య. ఓ అమ్మాయికి మాయమాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్లారు. విషయం తెలియడంతో
అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయి యువకుడిని ఫోక్సో చట్టం కింద పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన భార్యను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కడలూరు
జిల్లా దిట్టకుడి సమీపంలోని ఉల్లవయ్యంగుడి గ్రామానికి చెందిన అశోక్కుమార్ (33). ఇతని
భార్య చెల్లకిళి (28). వీరికి వివాహమై ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
అయితే ముగ్గురూ ఆడపిల్లలు కావడంతో వారికి మగ పిల్లాడు కావాలని కోరిక కలిగింది. ఎలాగైనా వారసుడు కావాలన్న ఉద్దేశంతో ఓ కన్నింగ్
ప్లాన్ వేశారు. అదే ప్రాంతంలో ఉన్న 17 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తమ వైపుకు తిప్పుకున్నారు. ఈ నెల 7వ తేదీ దిట్టకుడి సమీపంలోని ఓగలూరు గ్రామంలో ఉన్న కులదైవం ఆలయంలో కుటుంబంతో పాటు వెళుతున్నట్లు చెప్పి బాలికను తనతో పంపాల్సిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు. అసలు విషయం తెలియని తల్లిదండ్రులు అశోక్కుమార్ కుటుంబంతో తమ కుమార్తెను పంపారు.
ఆలయంలో సంప్రదాయ పద్దతుల్లో చెల్లకిళి తన
భర్త అశోక్కు బాలికతో
పెళ్లి చేసింది. అయితే మూడు రోజులు అయినప్పటికీ కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానించిన బాలిక తల్లిదండ్రులు అశోక్కుమార్ భార్యను రప్పించారు. అయితే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించారు. దీనిపై బాలిక తల్లి విరుదాచలం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముందు చెల్లకిళిని పోలీసులు
అరెస్ట్ చేశారు.. తర్వాత పరారీలో ఉన్న అశోక్ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో బాలికను అశోక్కుమార్, అతని
భార్య కలిసి మాయమాటలు చెప్పి అశోక్కుమార్తో ఆలయంలో వివాహం జరిపించినట్లు తెలిసింది. అలాగే అతని వద్ద విచారణ జరపగా తనకు మగ సంతానం లేకపోవడంతో బాలికను వివాహం చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో అశోక్కుమార్ మరియు అతని భార్యను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి కడలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.