నిన్నటి రోజున మిలాద్ నబి వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. దేశంలో ముస్లిం యువత ర్యాలీలు చేసింది. ర్యాలీలు జరిపి తమ ఐక్యతను చాటుకుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.
అయోధ్య తీర్పు వెలువడిన మరుసటి రోజు మిలాద్ నబి వేడుకలు ఉండటంతో దేశంలో ఎలాంటి ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఉంటాయో అని పోలీసులు ఇబ్బందులు పడ్డారు.
కానీ, అటువంటివి ఏమి లేకుండా అంతా సక్రమంగానే జరిగే విధంగా చూశారు. ఎక్కడా ఎలాంటి తప్పిదాలు జరగలేదు. అంతా సవ్యంగా జరిగింది. అయితే, ఓ విషయంలో మాత్రం కొంత ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలోని కోలార్ లో మిలాద్ నబి ఉత్సవాల్లో కొంత అపశృతి చోటు చేసుకుంది. అదేమంటే.. ఈ ఉత్సవాలు జరిగే సమయంలో అక్కడి యువత అత్యుత్సాహం ప్రదర్శించింది.
ఉత్సవాల్లో భాగంగా యువత ఓ పాత తరానికి చెందిన ఫిరంగును తీసుకొచ్చి అందులో గుండు పెట్టి పైకి పేల్చాలని చూసింది. కానీ, ఆ గుండు రివర్స్ అయ్యి వెనక్కి పేలడంతో .. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత తరానికి చెందిన ఫిరంగులను ఇలా ఉత్సవాల్లోకి తీసుకురావడం తప్పు.
అలానే, ఇలా ఫిరంగులు తీసుకొచ్చేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు. ఎలా ఇచ్చారు.ఫిరంగులో పెట్టె గుండు ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. కోలార్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు ప్రశాంతగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అయోధ్య తీర్పు తరువాత ఎక్కడ ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.