తెలుగు
భాషంటే చంద్రబాబునాయుడుకు ఎంత ప్రేముంది ? ఎంతంటే పై ఫొటోని చూస్తే చాలు ఎవరికైనా
అర్ధమైపోతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి
ప్రధానమంత్రి నరేంద్రమోడితో శంకుస్ధాపన చేయించినప్పటి ఫొటో ఇది. ఈ ఫొటోలో
ఎక్కడైనా కనీసం ఒక్క తెలుగు పదమైనా
కనబడుతోందా ?
బూతద్దంతో వెతికినా ఒక్కపదం కూడా కనబడదు. ఎందుకంటే అందులో లేదు కాబట్టి. ప్రధానమంత్రి వచ్చినపుడు శిలాఫలకాలను ఇంగ్లీషులో వేయించటం తప్పేమీ కాదు. కానీ అదే శిలా ఫలకాన్ని తెలుగులో కూడా వేయించుంటే ఇంకా బాగుండేది. తమిళనాడు, కర్నాటక, ఉత్తరాధి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా తమ మాతృభాషలో శిలా ఫలకాలు వేయించటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఒక్క ఏపిలో మాత్రమే విచిత్రమైన పరిస్ధితి రాజ్యమేలుతోంది.
అందులోను ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుండి తెలుగును అమితంగా ప్రేమిస్తున్న చంద్రబాబు సిఎంగా ఉన్న రోజుల్లో జరిగిన కార్యక్రమం కదా ? అందుకనే రాజధాని వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన శంకుస్ధాపన కార్యక్రమంలో శిలాఫలకాన్ని ఇంగ్లీషులోనే వేయించారు. తాను సిఎంగా ఉన్నపుడు ఇంగ్లీషు మీడియానికే భవిష్యత్తని ఊరూ వాడ ఎక్కి ఊదరగొట్టిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీషు మీడియంను పూర్తిగా వ్యతిరేకిస్తుండటమే విచిత్రంగా ఉంది.
ఇక్కడ ఇంగ్లీషు మీడియమా ? లేకపోతే తెలుగు మీడియమా ? అన్నది కాదు ఇంపార్టెంటు. జగన్ చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకించటమే ముఖ్యం. ప్రజోపయోగమైన ఎటువంటి నిర్ణయాన్ని జగన్ తీసుకున్నా వ్యతిరేకించాల్సిందే అని చంద్రబాబు, పవన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో భాగమే జనాల్లో వ్యతిరేకతను రెచ్చ గొట్టటం.
కానీ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యతిరేకత అంతా చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాలో మాత్రమే కనబడుతోంది. జనాలెవరూ జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించటం లేదు. ఎందుకంటే చంద్రబాబు, పవన్, వెంకయ్యనాయుడు పిల్లలు, వారసులు ఎక్కడ చదువుతున్నారో అందరికీ తెలుసు కాబట్టే వాళ్ళ ఆరోపణలు, వ్యతిరేకతకు విలువ లేకుండా పోతోంది.