మహారాష్ట్రలో బీజేపీకి శివసేన మాములుగా షాక్ ఇవ్వలేదు. మిత్రపక్షం అంటూనే బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. దీనితో బీజేపీ కూడా శివసేన మీద తీవ్ర కోపంతో ఉంది. జాతీయ రాజకీయాలను పూర్తిగా గుప్పిట్లో పెట్టుకునేందుకు వేస్తోన్న ఎత్తులు వరుసగా సక్సెస్ అవుతుండడంతో మాంచి జోష్లో ఉన్న బీజేపీకి మహారాష్ట్రలో శివసేన ఇచ్చిన షాక్తో కోలుకోలేకపోతోంది. మిత్రపక్షంగా ఉంటూనే శివసేన చేసిన నమ్మక ద్రోహానికి బీజేపీ బదులు తీర్చుకోనుందా ? ఇందుకోసం ? అక్కడ ధీర్ఘకాలిక వ్యూహం అమలు చేయబోతోందా ? శివసేనను చరిత్రలో శిథిలం చేయడమే లక్ష్యంగా కొత్త ఎత్తుగడలు వేస్తోందా ? అంటే ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ప్రశ్నలకు అవుననే ఆన్సర్లు వస్తున్నాయి.
బీజేపీ ప్రతి పక్షంలో కూర్చొని ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూల్చే ప్రయత్నం చేయోచ్చని టాక్ వస్తుంది. 105 సీట్లు ఉండి గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించినా కూడా ఆ పార్టీ అందుకు ఒప్పుకోకుండా ప్రతిపక్షంలో కూర్చునేందుకే ఇష్టపడడం వెనక పెద్ద ప్లానే దాగి ఉందని తెలుస్తోంది. ముందుగా శివసేన ఎంపీ సంజయ్రౌత్తో మాట్లాడించిన ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే ఆ తర్వాత తానే స్వయంగా మాట్లాడడం కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అటు ఎన్సీపీతో మంతనాలు చేయడం కూడా బీజేపీకి ఎంత మాత్రం నచ్చలేదు.
దీనితో ప్రస్తుతం అధికారానికి దూరంగా ఉండటమే మేలని బీజేపీ భావిస్తుంది. ఇక ప్రభుత్వ ఏర్పటుకు ముందు పలుమార్లు చర్చలు జరిపిన బీజేపీ జాతీయ, మహారాష్ట్ర నాయకులు శివసేన బెదిరింపులకు లొంగకూడదని... ఒకవేళ శివసేన కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేశాక ఆ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యారు. పూర్తి వైరుధ్య భావాలున్న కాంగ్రెస్, శివసేన కలిస్తే దీనిని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుని మహారాష్ట్రలో ఏకైక హిందుత్వ పార్టీగా బిజెపి నిలిచేందుకు వ్యూహం పన్ననుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.శివసేన నమ్మక ద్రోహంతో పాటు ఆ మూడు పార్టీల అపవిత్ర కలయికను సైతం ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నదే బీజేపీ బిగ్ స్కెచ్ అట.