మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి . కాంగ్రెస్ మద్దతు తో శివసేన , ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి . ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో , శివసేన ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ఆహ్వానించి విషయం తెల్సిందే . శివసేన, ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో సమాలోచనలు జరిపిన కాంగ్రెస్ పార్టీ నేతలు, శివసేన సర్కార్ కు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని తీర్మానించారు.
శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరుతూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫోన్ చేశారు . థాకరే విజ్ఞప్తిపై సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తరువాత, శివసేన ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది . దీంతో శివసేన, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతోపాటు, సీఎంగా ఉద్దవ్ థాకరే ఉంటే బాగుంటుందని సోనియాగాంధీ సూచించినట్లు సమాచారం . ముఖ్యమంత్రి పదవికి ఆదిత్య థాకరే పేరును శివసేన నాయకత్వం పరిశీలిస్తున్న విషయం తెల్సిందే .
కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించగానే , శివసేన నేతలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ నేతలు ఏక్ నాథ్ షిండే, ఆదిత్య థాకరే లు మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని తమకున్న ఎమ్మెల్యేల బలాన్ని వివరించారు . తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి 105 స్థానాల్లో విజయం సాధించగా , శివసేన 56 సీట్లు కైవసం చేసుకుంది .