మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం ఎటు వైపు మలుపు తిరుగుతుందో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి . బిజెపి శివసేన కూటమి విభేధించడంతో రాష్ట్రం లో రోజుకో ట్విస్ట్ తెర మీదకు వస్తుంది. శివసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ పార్టీ నాయకుడిని సీఎం సీటులో కూర్చోబెట్టడానికి తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. అయితే శివసేన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించిన గవర్నర్ భగత్ సింగ్ కోశిరియా శివసేనకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 24 గంటలు సమయం ఇచ్చారు. అయితే గవర్నర్ ఇచ్చిన 24 గంటల సమయం నిన్న సాయంత్రం 7:30 ముగియడానికి ముందే శివసేన యువనేత ఆదిత్య థాకరే.. శివసేన ముఖ్యనేతలు గవర్నర్ తో సమావేశం అయ్యారు.
తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని దీనికోసం మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు తమకు 48 గంటల సమయం కావాలంటూ గవర్నర్ ను అభ్యర్థించారు శివసేన పార్టీ నేతలు. అయితే దీనికి నిరాకరించిన గవర్నర్ మహారాష్ట్రలో మూడవ అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీ ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఎన్సీపీ కూడా 24 గంటల సమయం ఇచ్చారు. గవర్నర్ 24 గంటల సమయం ఇచ్చినప్పటికీ అటు కాంగ్రెస్ శివసేన పార్టీలు ఎన్సీపీకి మద్దతు తెలపడం అసాధ్యం. దీంతో ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కుదరదు. ఇదిలా ఉండగా మొదట గవర్నర్ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ కీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 24 గంటల సమయం ఇవ్వగ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ పార్టీ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శివసేనకు ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కేటాయించ గా... తాజాగా ఎన్సీపీ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు సమయం కేటాయించారు గవర్నర్.
అయితే ఇప్పటికే మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీ అయిన బిజెపి శివసేన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు లో విఫలం కావడంతో...ఇక ఇప్పుడు ఎన్సీపీ కీ ప్రభుత్వ ఏర్పాటు కష్టతరమే. దీంతో మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన రాబోతుందని మహా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద పార్టీలైన మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సమయం ఇచ్చినప్పటికీ విఫలం కావడంతో... చివరగా రాష్ట్రపతి పాలనకు కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ సిఫార్సు చేస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.