కొందరు నీచులు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. వ్యసనాలకు బానిసై.. వాటి కోసం భార్యాబిడ్డలను కాల్చుకు తింటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పశువు కూడా ఆ కోవకు చెందినవాడే. పశ్చిమగోదావరి నరసాపురం మండలం సార్వా గ్రామంలో అలీషా అనే అతని భార్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు..


పెళ్లాం గల్ఫ్ లో సంపాదించి ఇంటికి డబ్బులు పంపుతుంటే ఇక్కడ జల్సా చేస్తున్న అలీషా.. వ్యసనాలకు బానిసై రాక్షసుడిగా మారాడు. భార్య తాను ఆశించినంత డబ్బు పంపలేదని కోపగించాడు. ఆ కోపం కన్న కూతుళ్ల మీద చూపాడు. గల్ఫ్‌లో ఉన్న భార్య ఫోన్‌ చేయలేదనే కోపంతో భర్త అలీష తన ఇద్దరు పిల్లలను చితక బాదాడు. దాంతోపాటు ఆ దృశ్యాల్ని వీడియో రికార్డు చేశాడు.


ఆ వీడియోను భార్యకు పంపి.. తనకు ఫోన్ చేయాలని.. అడిగినంత డబ్బుపంపాలని బెదిరించాడు. డబ్బు పంపకపోతే.. ఇంత కంటే ఎక్కువగా హింసిస్తానని హెచ్చరించాడు. మరీ ఎక్కువ చేస్తే పిల్లను చంపేందుకు కూడా వెనుకాడనని వార్నింగ్ ఇచ్చాడా రాక్షసుడు. దీంతో బెదిరిపోయిన ఆ భార్య.. ఆ వీడియోలను తన బంధువులకు పంపి.. తన పిల్లలను కాపాడాలని కోరింది.


ఆ వీడియో చూసి చలించిపోయిన బంధువులు హుటా హుటిన సార్వా గ్రామానికి చేరుకుని అలీషా పిల్లను కాపాడారు. ఇక్కడ ఉంటే ఆ పిల్లను బతకనివ్వడని భావించి తమతో తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు అలీష ఇంటికి వెళ్లారు. వీడియో చూసిన వారి బంధువులు అప్పటికే పిల్లల్ని తీసుకెళ్లిపోయారని తెలుసుకుని పరారీలో ఉన్న నిందితుడు అలీష కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు సుమోటో గా కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు


మరింత సమాచారం తెలుసుకోండి: