బీజేపీతో పొత్తు పెట్టుకున్న మరో పార్టీ...తమ దారి తాము చూసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలో దిగనున్నట్లు తెలిపింది. శాసనసభ ఎన్నికల్లో లోక్జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ స్పష్టం చేశారు. మొత్తం 81 స్థానాలకు గానూ 50 స్థానాల్లో ఎల్జేపీ పోటీ చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. బీహార్లోని జముయ్ నుంచి పాశ్వాన్ ఎంపీగా గెలుపొందారు. తన
తండ్రి రాంవిలాస్ పాశ్వాన్
కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిలో ఎల్జేపీ కీలక భాగస్వామి.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న ప్రారంభమై ఐదు విడుతల్లో జరగనున్నాయి. తొలి విడుతలో 13 స్థానాలకు నవంబర్ 30న, రెండో విడుతలో 20 నియోజకవర్గాలకు డిసెంబర్ 7న, మూడో విడుతలో 17 స్థానాలకు డిసెంబర్ 12న, నాలుగో విడుతలో 15 స్థానాలకు డిసెంబర్ 16న, చివరి విడుతలో 16 నియోజకవర్గాలకు డిసెంబర్ 20న పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇప్పటికే...బీజేపీ కూటమికి శివసేన దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సీట్ల గేమ్లో...సేన గుడ్బై చెప్పేసింది. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ...ఆ పార్టీ బీజేపీకి దూరమైనట్లే. మహరాష్ట్ర ఎన్నికల్లో శివసేన తన మిత్రపక్షం బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి కుర్చీ కోసం మొదలైన కొట్లాట ఎన్డీయే కూటమిలో చీలికకు దారితీసింది. శివసేన ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్వింద్ సావంత్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.