అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ని కాపాడబోయి మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయిన కార్యాలయ అటెండర్ చంద్రయ్య గత కొన్ని రోజులుగా కాంచన్ బాగ్ లోని డిఆర్ డివో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . విజయారెడ్డి సజీవ దహనం కాగా , ఆమెను కాపాడబోయిన డ్రైవర్ గురునాథం , నిందితుడు సురేష్ మృతి చెందిన విషయం తెల్సిందే . చంద్రయ్య పరిస్థితి రోజుకింత విషమంగా మారుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . అయితే చంద్రయ్య వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని తొలుత చెప్పిన రెవెన్యూ అధికారులు , ఇప్పుడు మాట మార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు .
చంద్రయ్య కు అందుతున్న వైద్యం గురించి ప్రభుత్వ అధికారులు, ఏమాత్రం పట్టించుకోకపోగా , వైద్య ఖర్చులతో ఇప్పుడు తమకేమి సంబంధం లేదని సరూర్ నగర్ తహశీల్ధార్ శ్రీనివాస్ రెడ్డి డిఆర్ డివో ఆసుపత్రి యాజమాన్యానికి చెప్పడమే కాకుండా , చంద్రయ్యను గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు తెలుస్తోంది . ఇప్పటికే వరకు చంద్రయ్య కు వైద్య చికిత్స నిమిత్తం మూడు లక్షల రూపాయల బిల్లు అయిందని, దాన్ని చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులను కోరడం తో వారికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో నెలకొంది . ఇప్పటి వరకు వైద్య చికిత్స నిమిత్తం అయిన బిల్లుమొత్తం చెల్లిస్తేనే , ఇకపై వైద్యం కొనసాగిస్తామని అపోలో డిఆర్ డివో ఆసుపత్రి వర్గాలు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు .
డబ్బులు లేకపోతే ఇప్పటి వరకు అయిన వైద్య ఖర్చులు చెల్లించిన తరువాత, వైద్యం కోసం ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు డిఆర్ డివో అపోలో ఆసుపత్రి వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది . ప్రభుత్వం స్పందించి చంద్రయ్య కు మెరుగైన చికిత్స అందించడంతోపాటు , ఆసుపత్రి బిల్లు చెల్లించాలని లేకపోతే తాము కూడా ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబసభ్యుల హెచ్చరిస్తున్నారు .