కన్న కొడుకు చేతులు తాడుతో  కట్టేసి , అతని ఒంటిపై  కిరోసిన్ పోసి నిప్పంటించి తల్లితండ్రులే  సజీవదహనం చేసిన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది . ఉమ్మడి వరంగల్ జిల్లా దామెర మండలం , ముస్తాలపల్లి గ్రామం లో ఈ దారుణం జరిగింది . కొడారి ప్రభాకర్, వేములమ్మ దంపతుల కుమారుడు మహేష్ చంద్ర . మహేష్ కు రజిత తో వివాహాన్ని జరిపించారు . వారికి ఒక బాబు , పాప జన్మించారు. అయితే గొడవల కారణంగా  కొన్నేళ్ల క్రితం  రజిత, భర్తను వదిలేసివెళ్లిపోయింది .


 వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో గుమస్తా గా పని చేస్తోన్న మహేష్ చంద్ర మద్యానికి  బానిసయ్యాడు . ప్రతిరోజూ మద్యం  తాగివచ్చి తల్లితండ్రులను చిత్రహింసలు పెడుతుండడంతో వారు విసిగిపోయారు . ఈ క్రమం లోనే మహేష్ చేతులు కట్టేసి  ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి హత్య చేశారు .  ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు . కన్నతల్లితండ్రులే తమ కొడుకును సజీవ దహనం చేశారన్న వార్త జిల్లాలో దావానంలా వ్యాపించింది .


కన్నకొడుకును చంపుకోవడానికి వారికేమి మాయరోగం అంటూ నిందించే వారు కొందరైతే, కన్నకొడుకునే  తల్లితండ్రులు సజీవ దహనం చేశారంటే వారెంతగా అతడి చేష్టలతో విసిగిపోయి ఉంటారోనని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు . మహేష్ చంద్ర ను భార్య విడిచివెళ్లడం వల్లే  మద్యానికి బానిసయి , మద్యం మత్తులో తల్లితండ్రులను చిత్రహింసలకు గురి చేసేవాడన్న వాదనలు విన్పిస్తున్నాయి . తల్లితండ్రులనే చిత్రహింసలకు గురిచేసిన ప్రబుద్ధుడు భార్యను ఎంత చక్కగా చూసుకునేవాడో ఇట్టే అర్ధం చేసుకోవచ్చునని , అందుకే ఆమె అతడ్ని విడిచి వెళ్లి ఉంటుందని అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: