పెరుగుతున్న సాంకేతికతతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. ఒకప్పుడు నెలల తరబడి సాగే ప్రయాణాలు కూడా ఇప్పుడు తమ కాలం కుదించుకుంటున్నాయి. అయితే ఎంత జెట్ స్పీడ్ యుగమని చెప్పుకుంటున్నా.. ఇంకా కొన్నిదేశాలకు వెళ్లాలంటే రోజుల తరబడి ప్రయాణం తప్పడం లేదు. విమానాల్లో ప్రయాణిస్తున్నా.. గంటల తరబడి ప్రయాణం సాగించాల్సిందే.
ఒక ఖండం నుంచి మరో ఖండం.. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం ఇప్పటికీ సుదీర్ఘ సమయం తప్పడం లేదు. ఉదాహరణకు సిడ్నీ నుంచి లండన్ వెళ్లాలంటే.. కనీసం 19 గంటలు ఆగకుండా ప్రయాణించాలి. అయితే త్వరలోనే విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.
ఇండియా నుంచి అమెరికాకు సైతం కేవలం అరగంటలో వెళ్లే ప్రయాణ సాధనాలు రాబోతున్నాయి. ఇండియా నుంచి అమెరికాకి అరగంటలో వెల్లగలిగితే..ఎంత బావుంటుంది. అయితే ఇది ఊహ మాత్రమే కాదు.. ఇది వాస్తవం కూడా కాబోతోంది. కాకపోతే ఇప్పుడే కాదు.. 2069లో అన్నమాట.
అంటే.. మరో 50 ఏళ్ల తర్వాత అన్నమాట. అప్పటికి రవాణాకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు వచ్చేస్తాయట. భూమిపైన ఓ ఖండం నుంచి మరో ఖండానికి నిమిషాల్లో చేరుకుంటారట. ధ్వని కంటే ఐదురెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే విమానాలే ప్రధాన రవాణా సాధనాలవుతాయట. గంటకి 95 వేల మైళ్ల వేగంతో ప్రయాణించే ‘రీ-యూజబుల్’ రాకెట్ లు వచ్చేస్తాయట.
వీటితో భారత్ నుంచి అమెరికాకి అరగంటలో చేరుకోవచ్చట. రైళ్లకు బదులుగా సూపర్సోనిక్ ట్యూబ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వచ్చేస్తాయట. సముద్ర, భూగర్భాల్లో ప్రయాణిస్తారట. రోడ్లపైన కార్లకి బదులు క్వాడ్పాడ్లు వస్తాయట. అంటే ఇవి భూమి, నీరు, ఆకాశం ఎక్కడైనా ప్రయాణిస్తాయన్నమాట. అంతే కాదు.. యాభై ఏళ్ల తర్వాత మనుషులు డ్రైవ్ చేయడం నేరం అవుతుందట.
ఎందుకంటే అప్పుడు ఎలాంటి వాహనాలేవైనా సరే వాటికవే నడుస్తాయి. అలాంటి టెక్నాలజీ వస్తుంది. ఇవన్నీ ఎవరి ఊహలో కాదు.. లండన్లో శాంసంగ్ సంస్థ ఏర్పాటు చేసిన టెక్నాలజీ పార్కు పార్కులో నిపుణులు అంచనా వేసి రూపొందించిన రిపోర్టులు. కాకపోతే.. అవి చూడాలంటే మనం మరో 50 ఏళ్లు బతికి ఉండాలి.