జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ముందేమో జగన్మోహన్ రెడ్డిని బెదిరించాలని చూశారు. సాధ్యం కాకపోవటంతో ఇపుడు శాపనార్ధాలకు దిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దాన్ని వ్యతిరేకిస్తు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో పాటు ఎల్లోమీడియా నానా రచ్చ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే.

 

ఇదే విషయమై ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ  తెలుగుమీడియం గురించి మాట్లాడుతున్న పవన్ తన పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. దానికి సమాధానం చెప్పుకోలేని పవన్మీడియా సమావేశంలో జగన్ ను నానా మాటలన్నారు. ఒక విధంగా జగన్ ను బెదిరిస్తు మాట్లాడారు.

 

పవన్ ఏ స్ధాయిలో అయితే మాట్లాడారో అంతకు రెట్టింపు స్ధాయిలో మంత్రులు పేర్నినాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుండి కౌంటర్ వచ్చింది. పిల్లల చదువుల గురించి మాట్లాడుతు జగన్ అడిగిన ప్రశ్నలకు ముందు పవన్ సమాధానం చెప్పాలంటూ మంత్రులు కుడా నిలదీశారు.

 

అయితే బుధవారం విశాలాంధ్ర బుక్ హౌస్ కు వెళ్ళిన పవన్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ కు శాపనార్ధాలు పెట్టటమే విచిత్రంగా ఉంది. జగన్ అడిగిన సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక చివరకు శాపనార్ధాలకు దిగుతున్నారా అని అనిపించింది. తెలుగును నిర్లక్ష్యం చేస్తే జగన్ మట్టికొట్టుకుపోతారట. జగన్ కు మద్దతుగా నిలబడే ఎంఎల్ఏలు కుడా మట్టికొట్టుకుపోవటం ఖాయమంటూ పదే పదే  ఒకే మాటను రిపీట్ చేశారు.

 

 తాను మాతృభాషలోనే చదివినట్లు చెప్పుకున్న పవన్ తన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే జనసేనాని పిల్లలు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదువుతున్నారు. ఆ విషయం బయటకు చెప్పుకోలేని పవన్ సిఎం ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పుకోలేక శాపనార్ధాలకు దిగినట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: