చిన్నారి ద్వారక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో నిందితుడు ప్రకాష్ కీలక విషయాలను వెల్లడించాడని సమాచారం. మొదటి నుంచి ప్రకాష్ ది చిన్నారులను లైంగికంగా వేధించే తత్వం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చిన్నారులే టార్గెట్ గా ఎవరూ లేని సమయంలో ఇలా లైంగిక దాడులకు పాల్పడతాడని పోలీసులు గురించి గుర్తించారు. ద్వారకను హత్య విషయంలో కూడా ప్రకాష్ ఇదే విధంగా లైంగిక దాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్టు పోలీసులు ఒక అంచనాకు వస్తున్నారు.


బెజవాడలో చిన్నారి ద్వారక హత్య కేసుకు సంబంధించి తొలి నుంచి హైడ్రామా నడిచింది. ఎనిమిదేళ్ళ బాలికను ఎవరైనా ఎత్తుకెళ్ళారా? అనే దిశగా పోలీసుల విచారణ కొనసాగింది. ఒక రోజంతా బాలికను ఎత్తుకెళ్ళారన్న కోణంలోనే పోలీసు విచారణ కొనసాగింది. అందులో భాగంగానే డ్రోన్ కెమెరాలతో ద్వారక ఇంటి పరిసర ప్రాంతాలతోపాటు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలనపైనే పోలీసులు ప్రధానంగా దృష్టిపెట్టారు. అయితే ఇంత చేసినా ద్వారక ఆనవాళ్లకు సంబంధించి  ఒక్క ఆధారం కూడా తెలియకపోవటంతో పోలీసులకు సవాలుగా మారింది. బాలికను ఎత్తుకెళ్ళిపోయారా అనే కోణంలో ప్రత్యేక బృందం బస్టాండ్, రైల్వే స్టేషన్లను జల్లెడ పట్టినా ఫలితం లేదు. అయితే చివరికి పక్కింట్లోనే శవంగా తేలటంతో అంతా షాక్ కు గురయ్యారు.


హత్యకు పాల్పడిన ప్రకాష్ కు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జి.కొండూరులో నివసిస్తున్న సమయంలోనే రెండేళ్ళ క్రితం మూగ బాలికపై అత్యాచార యత్నం చేసిన ప్రకాష్ పై కేసు నమోదైంది. ఆ కేసులో కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ప్రకాష్ భవానీపురంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. ఇతనికి మద్యం సేవించి అలవాటు ఎక్కువగా ఉందని, అదే విధంగా చిన్నారులే టార్గెట్ గా లైంగిక దాడులు చేసే ఆలోచనలు తరచూ చేస్తాడని పోలీసు విచారణలో వెల్లడైంది. తొలుత వివాహేతర సంబంధం కారణంగా హత్య జరిగిందనే కోణంలో విచారణ చేపట్టినా అందుకు ఆధారాలు లేకపోవటంతో పోలీసులు ప్రకాష్ మీదే దృష్టిపెట్టి అసలు విషయాలను రాబట్టారు.


ద్వారకను హత్య చేసిన విధానాన్ని పోలీసు విచారణలో ప్రకాష్ వివరించాడు. ఆదివారం కావటంతో టీవీ చూడటానికి ప్రకాష్ ఉన్న గదిలోకి చిన్నారి ద్వారాక వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో అతను ద్వారకపై అత్యాచార యత్నం చేశాడు. ద్వారక గట్టిగా అరవటంతో ఒక్కసారిగా ఖంగారు పడిన ప్రకాష్ వెంటనే ఆమె గొంతు, ముక్కు గట్టిగా నొక్కేశాడు. దీనితో ఊపిరి ఆడక అక్కడిక్కడే ద్వారాక మృతి చెందింది. ద్వారక మెడపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అత్యాచారానికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక కీలకం కానుంది. అది వచ్చిన తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు వెల్లడించున్నారు.


ద్వారకను హత్య చేసి, ఇంట్లో గోనె సంచిలో మూటకట్టిన ప్రకాష్ ఆ తర్వాత బయటకు వచ్చి బాలిక తల్లిదండ్రులతోనే కలిసి వెతికాడు. అంత మంది పోలీసులు వెతుకుతున్నా, అందరిని విచారిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా వారితోనే కలిసే ఉన్నాడు. పైగా.. పోలీసులకు సలహాలు ఇచ్చాడు. కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా వాళ్ళ ముందు కన్నీళ్ళు పెట్టాడు. ఇదంతా పరిశీలించిన తర్వాత ప్రకాష్ తీరుపై కూడా పోలీసులు విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా హత్యలు చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కేవలం ఇంటి ముందు పోలీసులు ఉన్న కారణంగానే ప్రకాష్ ద్వారక మృతదేహాన్ని బయటకు తీసుకెళ్ళలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. కొంత సమయం కుదిరితే మృతదేహాన్ని పడేసే వాడని పోలీసులు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: