డేటా చోరీ కేసు గుర్తుందా.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వం దగ్గరున్న ప్రజల సమాచారాన్ని ఓ ప్రైవేటు కంపెనీకి అప్పగించిన కేసు అప్పట్లో సంచలనం కలిగించింది. ఎన్నికల సమయంలో వెలుగుచూసిన ఈ కేసు రాజకీయంగా చాలా ప్రకంపనలే సృష్టించింది. కానీ ఆ తర్వాత మాత్రం చప్పబడింది. ఇప్పుడు ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బ్లూ ఫ్రాగ్ సంస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది.


ఎలాగంటే.. డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖకు చెందిన బ్లూఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీ సంస్థ పై సీఐడీ దాడులు నిర్వహించింది. ఈ సంస్థ మరో చోరీలో అడ్డంగా దొరికినట్టు సీఐడీ పోలీసులు చెబుతున్నారు. ఈ కొత్త కేసు ఏమిటంటే.. ఇసుక సరఫరా సంబంధిత వెబ్‌సైట్‌ను ఈ సంస్థ హ్యాక్‌ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


దీంతో విశాఖలోని బ్లూ ఫ్రాగ్‌ సంస్థను సీఐడీ, పోలీసులు తనిఖీ చేశారు. సంస్థ సర్వర్లలోని డేటాను చెక్ చేశారు. బ్లూ ఫ్రాగ్‌ సంస్థకు చెందిన పలువురు వ్యక్తులు సైట్‌ను హ్యాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించినట్లు సీఐడీకి ఫిర్యాదు అందాయట. రంగంలోకి దిగిన సీఐడీ విశాఖలో ఉన్న బ్లూ ఫ్రాగ్స్ కార్యాలయంలో సోదాలు చేసింది.


స్టాక్‌యార్డ్‌లో పెద్దఎత్తున ఇసుక ఉన్న కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే ఇసుక లేనట్లు చూపించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ రూపొందించినట్లు సీఐడీ ఆరోపిస్తోంది. అందుకే కంపెనీ సర్వర్లలో డేటాను తనిఖీ చేసి పలు ఆధారాలను సేకరించింది. ఐపీ అడ్రస్‌ల ఆధారంగా మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.


గతంలో మన శాండ్‌ సైట్‌ను బ్లూఫ్రాగ్‌ సంస్థనే నిర్వహించింది. ఇసుక అక్రమ రవాణాపై జగన్ సర్కారు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షల వరకూ కనీస జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయిస్తూ.. కేబినెట్‌ కూడా నిర్ణయించింది. ఇలాంటి సమయంలో ఈ బ్లాఫ్రాగ్ బండారం బయటపడటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: