ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఇసుక కొరత సమస్య పట్టి పీడిస్తున్న విషయం తెలుసిందే. ఇసుక కొరతతో రాష్ట్ర ప్రజలందరికీ గుప్పెడు ఇసుక కూడా దొరక్క అల్లాడుతున్నారు.ఇక భవన నిర్మాణ రంగ కార్మికుల అవస్థలు అయితే అంతా ఇంతా కాదు. గత ఐదు నెలల నుంచి రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత కారణంగా కనీస ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది కుటుంబ పోషణ భారమై మనస్థాపం చెంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ అధికార వైసీపీ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారి వైసిపి పార్టీ నేతల అక్రమ ఇసుక రవాణా వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడినది అంటూ ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో దొరకకుండా అయిపొయింది అని అధికార వైసీపీ పై దుమ్మెత్తి పోస్తున్నాయి ప్రతిపక్షాలు.
ఈ క్రమంలో ఇసుక సమస్యలు తీర్చాలంటూ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ పార్టీకు చెందిన టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేష్ ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టగా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇక ఈ రోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 12 గంటల దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షపై అధికార వైసిపి నేతలు సెటైర్లు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి అధినేత చంద్రబాబు, టిడిపి ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేసారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నేతలంతా ఇసుక బకాసురులు అని చంద్రబాబు ఇసుక మాఫియాకు రారాజు అంటూ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కుతంత్రాల రాజకీయాల కోసం చంద్రబాబు సంక్షోభాలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్లూ ఫ్రాగ్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం వెబ్ సైట్ ను హ్యాక్ చేశారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇక చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్ష దొంగ దీక్ష అని చంద్రబాబుకు అని అన్న పార్థసారధి... దొంగ దీక్షలు చేయడం బాబుగారికి అలవాటే అంటూ విమర్శించారు. డేరా బాబా కు చంద్రబాబుకు పెద్ద తేడా ఏమీ లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పార్థసారథి.