ఒకవైపు దీక్ష చేస్తున్న
చంద్రబాబునాయుడుకు ఇద్దరు నేతలు షాక్ ఇచ్చారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా
రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీతో పాటు తెలుగుయువత
అధ్యక్షునిగా పనిచేసిన దేవినేని అవినాష్ కూడా పార్టీకి రాజీనామా చేసేశారు.
వీరిద్దరు వైసిపిలో చేరబోతున్నట్లు సమాచారం. అవినాష్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి
క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారట.
వంశీ గతంలోనే రాజీనామా చేసినప్పటికీ తన రాజీనామాను స్పీకర్ కు కాకుండా చంద్రబాబునాయుడుకు పంపారు. అందుకనే చంద్రబాబు రాజీనామా లేఖను స్పీకర్ కు పంపకుండా తన దగ్గరే ఉంచుకున్నారు. ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుండి చంద్రబాబుకు కానీ టిడిపి నేతలకు కాని అందుబాటులో లేరు.
తన రాజీనామా లేఖ చంద్రబాబు దగ్గరే ఉన్న విషయాన్ని పక్కనపెట్టేసి ఈసారి తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపుతారని సమాచారం. ఏదేమైనా కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఒకే రోజు పార్టీని వదిలేయటంతో చంద్రబాబుకు ఇబ్బందే అనటంలో సందేహం లేదు. ఒకవైపు తాను ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే మరోవైపు తన పార్టీ నేతలే రాజీనామాలు చేసి వైసిపిలో చేరటం చంద్రబాబుకు షాక్ అనే చెప్పాలి.
అదే సమయంలో విశాఖప్నటం ఉత్తరం నియోజకవర్గంలో గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి ఈరోజో రేపో రాజీనామా చేస్తారని అంటున్నారు. ఈయనతో పాటు మరో ఏడుగురు ఎంఎల్ఏలు కూడా పార్టీకి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి తన పార్టీలోనే ఏం జరుగుతోందో చివరకు చంద్రబాబుకే తెలుస్తున్నట్లు లేదు. ఎందుకంటే ఏ రోజు ఏ ఎంఎల్ఏ లేకపోతే ఏ నేత రాజీనామా చేస్తారో చెప్పలేకున్నారు. చివరకు పలానా నేత రాజీనామా చేస్తున్నారనే వార్తను మీడియా ద్వారానే చంద్రబాబు తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయనటంలో సందేహం లేదు.