భారత తొలి
ప్రధాని జవహర్లాల్ నెహ్రు
జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం చరిత్రను మార్చబోయే తొలి అడుగు వేస్తున్నామని, మనబడి నాడు-నేడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే వైఎస్సార్ ప్రభుత్వం మనబడి నాడు-నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనున్నారు.
ఒంగోలులో ఇప్పటికే ఎక్కడ చూసినా ఇంటర్నెటే కనిపిస్తోందని, మరో పదేళ్లలో పరిస్థితి ఇంకా మారిపోతుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేటి బాలలే రేపటి మన సమాజ నిర్మాతలని అన్నారు. ఈ క్రమంలోనే 45 వేల స్కూళ్లలో మూడు దశలుగా నాడు-నేడు కార్యక్రమం చేపడతామన్నారు. మొదటి దశ కింద 15,715 పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తరగతి గదుల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని, అదనపు తరగతి గదులు, ఇంగ్లీషు ల్యాబ్లు వంటి 9 రకాల సేవలు వస్తాయన్నారు. వీటితో పాటు ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.
ప్రతి ఏడాది పాఠశాలలకు రూ.3500 కోట్లు ఖర్చు చేస్తాం. 45 వేల పాఠశాలల రూపు రేఖలను మార్చుతాం. పాఠశాలల్లో అన్ని వసతులు తీసుకొస్తాం. ఉన్నత చదువులు చదువుతోన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటు పథకాన్ని కూడా తీసుకొస్తామన్నారు. అలాగే ప్రతీ పాఠశాలలోనూ రన్నింగ్ వాటర్తో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, లైట్లు,
రక్షిత తాగునీరు, విద్యార్థులు,
పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్, మొత్తం పాఠశాలకు పెయింటింగ్, మేజర్, మైనర్ ,మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం, గ్రీన్ చాక్ బోర్డ్ లు, అదనపు తరగతి గదులు.. ఈ తొమ్మిది వసతులు ఖచ్చితంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.