ఏపీఐఐసీ చైర్‌పర్సన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి పక్ష నేతలు ఇంగ్లిష్ మీడియం చదువులను వ్యతిరేకిస్తున్నారు. కానీ వారి పిల్లలను మాత్రం ఇంగ్లిష్ మీడియంలో కాక తెలుగు మీడియంలో చదివిస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు.


చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో రోజా గురువారం మాట్లాడారు. ప్రతి పక్ష నేతల తీరు చేస్తుంటే బాధాకరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలో నేతలు ఉన్నట్టుందని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు చదివితే మీకేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్న నేతల పిల్లలు ఎక్కడ చదుతున్నారని.. వారు విదేశాలకు వెళ్లి మరీ చదుతే, ఏంలేదు కానీ ఇక్కడ వాళ్లకు మాత్రం ఇంగ్లిష్ మీడియం వద్దా... అని ప్రశ్నించారు.


ఇంగ్లిష్ మీడియం చదువులతో తెలుగు చచ్చిపోవడం ఏంటో తనకు అర్థం కావట్లేదని రోజా వ్యాఖ్యానించారు. తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో, విదేశాల్లో చదివించే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలుగుని ఉద్ధరిస్తారట అంటూ సెటైర్లు వేశారు. ఓ ఆడియో టేప్‌లో చంద్రబాబు బ్రీఫ్‌డ్‌ మీ అంటూ తెలుగును చంపేశారని రోజా ఎద్దేవా చేశారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ తప్పనిసరన్న రోజా.. అందుకే సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. 


పేద పిల్లలకు కూడా ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రోజా అన్నారు. దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తోందని, ఈ రోజే నిజమైన బాలల దినోత్సవమని రోజా అన్నారు. నవరత్నాల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల వసతులు కల్పిస్తున్నారని ఆమె వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: