రాష్ట్రంలో ఇసుక కొరత విధానం ప్రతిపక్షాలకు బాగా కలిసి వచ్చింది. దీంతో ప్రతి పక్షాలు దీనిని ఆసరాగా చేసుకొని రాద్ధాంతం చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ,
జగన్ మాత్రం అవేమి పట్టించుకోవడం లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా నాకేంటి అనే రీతిలో సైలెంట్ గా ఉంటూ.. పనిచేసుకుంటూ పోతున్నాడు. విజయవాడలో నిన్నటి రోజున బాబుగారు 12 గంటల ఇసుక దీక్ష చేశారు.
12 గంటల ఇసుక దీక్షలు ఏంటి అన్నది తెలియడం లేదు. 12 గంటల దీక్షలు చేస్తే ఏమౌతుంది. ఏదైనా ఫలితం ఉంటుందా.. ఏదైనా చేస్తే ఫలితం వచ్చే వరకు చేయాలి. లేదంటే కామ్ గా కూర్చోవాలి. కానీ, ఇలా గంటల లెక్కన దీక్షలు చేస్తే ఉపయోగం ఏముంటుంది. ఎదో దీక్ష చేయాలి కాబట్టి దీక్ష చేసినట్టుగా ఉన్నది తప్పించి ఫలితం శూన్యం.
పైగా ఈ దీక్ష సమయంలో బాబుగారు కొంత ఆవేశంగా మాట్లాడారు. ఇసుక పాలసీ మీద మాట్లాడారు. ఇసుక కోసం ప్రజలపై లక్షల రూపాయల భారం వేస్తున్నారని వాదించారు. లక్షల రూపాయల భారం ప్రజలు ఎలా మోస్తారని అంటున్నారు.
జగన్ కు డబ్బు పిచ్చి పట్టిందని బాబుగారు మండిపడ్డారు. 280 రూపాయలు ఉండాల్సిన సిమెంట్ ధరలు డబుల్ అవుతున్నాయని బాధపడ్డారు.
ఇన్ని బాధలు పడినా అక్కడ ఉపయోగం లేదని బాబుగారుకి తెలియడం లేదు. ఈ దీక్ష వలన బాబుగారికి రాజకీయంగా ఏదైనా లాభం వచ్చిందా అంటే అదీ లేదు. సోషల్ మీడియాలో 12 గంటల దీక్షపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీక్ష చేయడం అంటే ఇలా కాదు. ఒకవేళ నిజంగా సమస్యలపై పోరాటం చేయాలి అంటే పొట్టిశ్రీరాములు,
గంగా ప్రక్షాళన కోసం ప్రాణాలు అర్పించిన రుషికేష్ స్వామీజీలను ఆదర్శంగా తీసుకోవాలని అప్పుడే ఏదైనా పనులు జరుగుతాయని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.