వివిధ ఆర్థిక పరమైన కారణాల వలన దివాలా దిశగా పయనిస్తున్న వొడాఫోన్ ఐడియా భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పుతో భారీ ఇబ్బందుల్లో పడిన వొడాఫోన్ ఐడియా, సాయం కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాలని యోచిస్తోంది. వడ్డీలు, లైసెన్సు ఫీజు బకాయిలపై జరిమానాలు, ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోతే కంపెనీ మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇకపోతే సుప్రీం కోర్టు తీర్పు పలు ఆర్థిక చిక్కులకు దారితీస్తుందని కంపెనీ సైతం భావించింది. ఇకపోతే ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఊరట కోసం డీఓటిని సంప్రదించే యోచనలో ఉన్నామని తెలిపింది. కాని స్టాక్మార్కెట్లో కంపెనీ షేరు విపరీతంగా క్షీణిస్తూ క్రమంగా రూ.4 వద్దకు దిగజారింది. దీంతో కంపెనీ భవితవ్యంపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇదంతా ఒకెత్తైతే గురువారం ప్రకటించిన సెప్టెంబరు త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కంపెనీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చాయి.
ఎందుకంటే ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా కంపెనీ ఈక్విటీలో ఆదిత్య బిర్లా గ్రూప్ నకు 26 శాతం, బ్రిటన్కు చెందిన వొడాఫోన్ గ్రూప్నకు 43 శాతం వాటా ఉంది. విలీన సమయంలోనూ రెండు కంపెనీలు రైట్స్ ఇష్యూ కింద రూ.25,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు సమకూర్చాయి. అప్పట్లో ఒక్కో షేరును రూ.12.5 చొప్పున కేటాయించారు. ఇప్పుడు అదే షేరు ధర రూ.2.95 స్థాయిలో ట్రేడవుతోంది. కాని కంపెనీ అప్పుల భారం ప్రస్తుతం రూ.లక్ష కోట్లకు చేరువైంది.
దీంతో మరిన్ని అదనపు నిధులు సమకూర్చి చేతులు కాల్చుకునేందుకు ప్రధాన ప్రమోటర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఇలా గుది బండలా మారిన వొడాఫోన్ ఐడియా ‘దివాలా’ తీసినా పట్టించుకోక పోవడమే మేలని ఆదిత్య బిర్లా గ్రూపు, వొడాఫోన్ గ్రూప్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దశలో ఈ రెండు సంస్దల మనుగడ ముందు ముందు కష్టతరమేనని తెలుస్తుంది..